తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాతో సరిహద్దు సంక్షోభంపై మోదీ ప్రసంగించరా?

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరిహద్దులో భారత్ చైనా మధ్య కొనసాగుతోన్న వివాదంపై ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక లేని లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందే మందగమనంలో ఉందని ఆరోపించారు.

By

Published : Jun 11, 2020, 10:33 PM IST

PM Modi should address the nation on India China conflict, says Adhir Ranjan Chowdhury
భారత్ చైనా సరిహద్దు ఘర్షణపై మోదీ ప్రసంగించరా?

భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించాలని కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ డిమాండ్ చేశారు. దేశం ఎదుర్కొనే ప్రతి ముఖ్యమైన విషయాలపై మోదీ ప్రసంగించినప్పుడు.. ఇది కూడా అంతే ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు. నెల రోజుల నుంచి అత్యంత ప్రధానమైన సమస్యపై కేంద్రం మౌనం వహిస్తూ వచ్చిందని ధ్వజమెత్తారు.

సరిహద్దు వివాదంపై

"వ్యూహాత్మక ప్రదేశాల్లో అతిక్రమణలు చోటుచేసుకుంటున్నాయి. సైనిక నిపుణులు ఈ విషయంపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మౌనాన్ని ప్రజలు సహించడం లేదు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతి ముఖ్యమైన సందర్భంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధానమంత్రి. ఈ సమస్య కూడా ముఖ్యమైనదేనని నా అభిప్రాయం."

--అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ సభాపక్షనేత

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు చౌధురీ. ఈ రైళ్లను డెత్ పార్లర్లుగా అభివర్ణించారు. రైల్వే శాఖ సరైన ప్రణాళిక, నిర్వహణ లేకుండా పని చేయడం వల్ల రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా నడిచినట్లు పేర్కొన్నారు. ఫలితంగా వివిధ కారణాలతో 90 మంది ప్రయాణికులు మరణించినట్లు ఆరోపించారు.

వలస కూలీలపై స్పందన

సరైన ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించారని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అధీర్.

వలస కార్మికుల దుస్థితిని ప్రభుత్వం ఎప్పుడూ తీవ్రంగా పరిగణించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం వల్ల నిస్సహాయులైన కార్మికులు కాలినడకనే తిరిగి స్వస్థలాలకు బయల్దేరారు. ఇదంతా ప్రణాళిక లేని లాక్ డౌన్ వల్లే. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం. దీని వల్ల భారత్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లింది.

---అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ సభాపక్షనేత

ప్యాకేజీపై..

ఆత్మ నిర్భర్ భారత్​

మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు అధీర్. పెద్ద పెద్ద హామీలు ఇవ్వడానికే ప్రభుత్వం పేరెన్నికగన్నదని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ పేరుతో జీడీపీలో ఒక శాతం మాత్రమే కేటాయింపులు జరిపారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేలా గతంలో ప్రకటించిన వాటినే ఇందులో ప్రస్తావించారని అన్నారు. ప్రజలకు మేలు కలగాలంటే వారికి నేరుగా నగదు బదిలీ చేయాలని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు అధీర్.

ఆర్ధిక వ్యవస్థపై

మన ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందే తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. కరోనాకు ముందు ఆర్థిక వృద్ధి 3.1 శాతం ఉంది. నిరుద్యోగం 8.5 శాతానికి ఎగబాకింది. ఇది 42 ఏళ్ల గరిష్ఠ స్థాయి. ఎగుమతులు మందగించాయి. కేవలం వ్యవసాయ రంగంలోనే కాస్త వృద్ధి కనిపించింది.

--అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ సభాపక్షనేత

దేశ ఆర్థిక వ్యవస్థను కరోనాకు ముందు, కరోనా తర్వాత అని రెండు రకాలుగా వర్గీకరించాలని అన్నారు అధీర్. అప్పుడే అసలైన వృద్ధి గణాంకాలు తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మొదటి రాత్రే భార్యను చంపేసిన భర్త!

ABOUT THE AUTHOR

...view details