తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2020, 1:07 PM IST

Updated : Apr 2, 2020, 3:22 PM IST

ETV Bharat / bharat

'ప్రతి ప్రాణం విలువైందే.. యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి'

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్​డౌన్​ దృష్ట్యా.. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, అమిత్​ షా వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

PM Modi holds video conference with CMs on coronavirus
ముఖ్యమంత్రులతో మోదీ దూరదృశ్య సమీక్ష

కరోనా నియంత్రణపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే రోజుల్లో టెస్టులు నిర్వహించడం సహా బాధితుల్ని గుర్తించడం, ఐసోలేషన్​, క్వారంటైన్​పైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. 9 రోజులుగా దేశంలో లాక్​డౌన్​ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపైనా ఆరా తీశారు.

కరోనా నియంత్రణకు రాష్ట్రాలన్నీ ఏకమై పోరాడటం ప్రశంసనీయమన్నారు మోదీ. లాక్​డౌన్​ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎంలతో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్నారు.

కరోనా కట్టడిపై ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం

''ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కరోనా కట్టడికి స్వచ్ఛంద, సంక్షేమ సంస్థలు, సామాజికవేత్తల సాయం తీసుకోవాలి. కరోనా హాట్​స్పాట్​లను యుద్ధప్రాతిపదికన గుర్తించడం, వైరస్​ వ్యాప్తి చెందకుండా చూసుకోవడం అత్యంత అవసరం.''

- వీసీలో మోదీ

కొవిడ్​-19 బాధితుల కోసం.. ప్రత్యేకంగా ఆసుపత్రుల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కోరారు ప్రధాని. అత్యవసర వైద్య ఉత్పత్తి పరికరాల సరఫరా, ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల లభ్యతకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.

చివరగా కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ చర్యలు భేష్​

సంక్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారని మోదీని కొనియాడారు ముఖ్యమంత్రులు. దిల్లీ మర్కజ్​ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇంకా ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను మోదీకి వివరించారు.

కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, అమిత్​ షా కూడా ఈ దూరదృశ్య సమీక్షలో పాల్గొన్నారు.

కరోనా సంక్షోభంపై రెండు వారాల వ్యవధిలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి. మార్చి 20న తొలిసారి సీఎంలతో సమావేశమైన మోదీ.. 24న దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Apr 2, 2020, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details