తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రూ.లక్ష కోట్ల నిధితో చిన్న రైతులకు పెద్ద అండ'

లక్ష కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న రైతులను శక్తిమంతంగా తీర్చిదిద్దడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

By

Published : Aug 9, 2020, 3:54 PM IST

PM launches Rs 1 lakh crore-financing facility under Agri-Infra Fund
'వారిని శక్తివంతులను చేయడం కోసం ఈ వ్యవసాయ నిధి'

చిన్న రైతులను శక్తిమంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వ్యవసాయం రంగంలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. లక్ష కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిధితో గ్రామీణ భారతంలో మౌలిక వసతులు పెరుగుతాయని, ఉద్యోగాలను సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిధి ద్వారా...

ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, పంట సేకరణ కేంద్రాలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తుంది. దీనిలో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకూ నిధులు ఇవ్వనుంది.

ఇందుకోసం 11 ప్రభుత్వరంగ బ్యాంకులతో కేంద్ర వ్యవసాయశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 2280మంది రైతులకు దాదాపు రూ. వెయ్యి కోట్లను విడుదల చేసినట్టు ప్రధాని వెల్లడించారు.

పీఎం కిసాన్‌ నిధులు..

పీఎం కిసాన్‌ పథకం కింద ఆరో విడత నిధులను మోదీ ఆదివారం విడుదల చేశారు. దీని ద్వారా దాదాపు 8కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూ.17వేల కోట్లను విడుదల చేసింది. మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఒకే ఒక్క క్లిక్కుతో ఎనిమిదిన్నర కోట్ల రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు చెప్పారు ప్రధాని.

పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ప్రతి రైతుకు రూ. 6 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది కేంద్రం.

ఇదీ చూడండి:-ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయుష్​ చిక్కీ'తో కరోనా పరార్​!

ABOUT THE AUTHOR

...view details