తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గ్రామాభివృద్ధికి దారి చూపిన లాక్​డౌన్​'

లాక్​డౌన్​తో నగరాల్లో ఉన్న ప్రతిభ అంతా గ్రామాలకు చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందువల్ల ఇక గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ యోజన'ను ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

By

Published : Jun 20, 2020, 3:46 PM IST

PM launches employment scheme for migrant workers
'లాక్​డౌన్​.. గ్రామాల అభివృద్ధికి ఇచ్చింది మార్గం'

వలస కూలీల ఉపాధి కోసం 'గరీబ్​ కల్యాణ్ రోజ్​గార్ యోజన'ను బిహార్‌లోని ఖగరియా జిల్లా తెలిహార్‌ గ్రామంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల నగరాల్లోని ప్రతిభగలవారంతా గ్రామాలకు చేరుకున్నారని.. దీని వల్ల గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు.

"లాక్​డౌన్​లో.. ప్రతిభ అంతా నగరాల నుంచి గ్రామాలకు చేరుకుంది. ఒకప్పుడు నగరాలను శక్తిమంతంగా తీర్చిదిద్దిన వారందరూ.. ఈ పథకం ద్వారా ఇప్పుడు గ్రామాలను అభివృద్ధి చేస్తారు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

లాక్​డౌన్​లో కేంద్రం ఎప్పుడూ వలస కార్మికుల గురించే ఆలోచించేదని మోదీ వెల్లడించారు. కూలీలు ఇప్పుడు తమ ఇళ్ల వద్దే ఉపాధి పొందే విధంగా ఈ పథకం ద్వారా కేంద్రం కృషి చేయనుందని పేర్కొన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలనూ ప్రధాని ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా నగరాల కన్నా గ్రామాల్లోనే అంతర్జాలాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారని... ఇప్పుడు ఇంటర్నెట్​ స్పీడ్​ను పెంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు స్పష్టం చేశారు.

125 రోజుల పని

వలస కార్మికులు ఎక్కువగా ఉన్న బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ యోజన'ను తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందుకోసం 25 రకాల పనులను గుర్తించారు. ఈ పథకం ద్వారా 125 రోజులపాటు కార్మికులకు పని కల్పించనున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు 25 వేల మంది కార్మికులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details