తెలంగాణ

telangana

'ఆర్​సెప్'కు భారత్​ దూరం... ఎవరికి లాభం? ఎవరికి నష్టం??

By

Published : Nov 13, 2019, 7:34 AM IST

ఆర్​సెప్​... కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన విషయం. ఆసియా-పసిఫిక్ దేశాల మధ్య ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరితే... స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో నవశకం ఆరంభం అవుతుందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. భారత దేశ ప్రయోజనాల మాటేంటన్న వాదనలూ వినిపించాయి. అనూహ్యంగా ఆర్​సెప్​కు దూరంగా ఉంటున్నట్లు భారత్​ ప్రకటించింది. ఇంతకీ ఈ నిర్ణయంతో నష్టం ఎవరికి? భారత్​కా లేక ఆర్​సెప్​ సభ్యదేశాలకా?

'ఆర్​సెప్'కు భారత్​ దూరం... ఎవరికి లాభం? ఎవరికి నష్టం??

'ఆర్​సెప్'కు భారత్​ దూరం... ఎవరికి లాభం? ఎవరికి నష్టం??

భారత దేశ ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా-పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల కోసం ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు ఆస్ట్రేలియా మాజీ దౌత్యవేత్త పీటర్ వర్గీస్​. భారత్​ లేని ఆర్​సెప్​(ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య) ఒప్పందం బలహీనంగా ఉంటుందని అన్నారు.

పీటర్​ ఇంతకు ముందు భారత్​లో ఆస్ట్రేలియా హైకమిషనర్​గా పనిచేశారు. భారత్​తో ఆర్థిక భాగస్వామ్యం కోసం ఆస్ట్రేలియా అనుసరించాల్సిన వ్యూహంపై ఓ దస్త్రం రూపొందించారు. ఇందులోని సిఫార్సులను అమలుచేయడంపై సోమవారం దిల్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు పీటర్. రానున్న రోజుల్లో భారత్​ 'ఆర్​సెప్'లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పీటర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖిలోని మరిన్ని వివరాలు...

ప్రశ్న: 'భారత ఆర్థిక వ్యూహం' నివేదిక విషయంలో సాధించిన ముఖ్యమైన పురోగతి ఏమిటి?

జవాబు:నివేదికలోని సిఫార్సుల విషయంలో ప్రభుత్వం హేతుబద్ధమైన వైఖరి అవలంబిస్తోంది. ఆయా సిఫార్సుల అమలులో పురోగతి సాధించడానికి ఇప్పుడు మాకు ఒక యంత్రాంగం ఉంది.

ప్రశ్న: భారత్ ఆర్​సెప్​కు దూరంగా ఉండడం ద్వారా ప్రపంచానికి వెళ్తున్న సందేశమేమిటి?

జవాబు: భారత్​తో కూడిన ఆర్​సెప్​ ఒప్పందం చాలా బలంగా ఉంటుంది. భారత్​ పూర్తిగా ఆర్​సెప్​లో చేరకుండా ఉంటుందని నేను భావించడం లేదు. ఎప్పటికైనా భారత్​ ఈ ఒప్పందంలో చేరడానికి వీలు కల్పించేలా చేయడం మా ప్రథమ కర్తవ్యం. సమీప భవిష్యత్తులో భారత్​ తప్పకుండా ఇందులో చేరుతుందని ఆశిస్తున్నాం. నూతన వ్యాపార సరళీకరణ వ్యవస్థలో ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్ ఆర్​సెప్​లో ఉండాలి. భారత దేశ​ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని అతిపెద్ద వ్యాపార సరళీకరణ ఒప్పందంలో భాగం కావడం ముఖ్యం. స్వేచ్ఛ, సరళీకృత వాణిజ్యానికి కేవలం ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. లేదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంధకారం అలుముకునే ప్రమాదం ఉంది.

ప్రశ్న: ఆర్​సెప్​లో చేరితే భారత్​లోకి చైనా వస్తువులు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఆసియాన్ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా కొన్ని దేశాలు వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఏమంటారు?

జవాబు: ఇవన్నీ భారత్​ తీసుకోవాల్సిన నిర్ణయాలు. వ్యాపార సరళీకరణ వల్ల మేమంతా కూడా స్వదేశంలో కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయోజనాలను సక్రమంగా బేరీజు వేసుకొని ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సరైన ఫలితాలు ఇస్తాయని మాత్రం చెప్పగలను. చైనా, జపాన్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బట్టి చూస్తే, ఇరు దేశాలు వీటి వల్ల లాభపడ్డాయి. ఈ విషయాన్ని గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. రెండు దేశాలకు సమ్మతమైన ఒప్పందం ద్వారా ఇద్దరూ లాభపడేలా చేయవచ్చు.

ప్రశ్న: చైనా వస్తువులకు భారత్​ డంపింగ్​ యార్డులా మారుతుందనే ప్రభుత్వ భయాలను అతిశయోక్తిగా భావిస్తున్నారా?

జవాబు:భారత ప్రభుత్వ భయాలను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇరువురికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వం మాత్రమే తీసుకునే నిర్ణయాలు.

ప్రశ్న: ఆస్ట్రేలియా, భారత్​ మధ్య సీఈసీఏ(సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం) కుదురుతుందని మీరు భావిస్తున్నారా?

జవాబు:ఆర్​సీఈపీ కోసం సీఈసీఏను నిలిపివేశారు. ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఆలోచించాల్సి ఉంటుంది. సీఈసీఏ ఒప్పందం లేకపోయినా ఇరుదేశాల ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవడం సహా పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు కేవలం ఆర్​సెప్​, సీఈసీఏపై ఆధారపడి ఉంటాయని అనుకోకూడదు.

ప్రశ్న: భారత్​ భాగస్వామి కాకపోతే ఆర్​సెప్ ఉనికి కోల్పోతుందా?

జవాబు: భారత్​ లేకపోతే ఆర్​సెప్​ బలహీనంగా ఉంటుంది. భారత్​తో కూడిన ఆర్​సెప్​ ఒప్పందం మరింత బలంగా ఉంటుంది. భవిష్యత్తులో భారత్ ఆర్​సెప్​లో చేరడానికి తలుపులు తెరిచే ఉంచడం​ ఆస్ట్రేలియా వంటి దేశాలకు చాలా ముఖ్యం. త్వరలోనే భారత్​ ఈ ఒప్పందంలో చేరుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడుదొడుకులు, వ్యాపార సరళీకరణలో ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి ప్రపంచ జీడీపీ, జనాభాలో మూడో వంతు భాగం కలిగిన దేశాలన్నీ కలిసి ఓ ఒప్పందానికి వస్తున్నాయంటే ఇదొక గొప్ప ముందడుగనే చెప్పాలి. భారత్ తన స్వప్రయోజనాల ప్రకారం ఒప్పందం నుంచి బయటకు వెళ్లడం కంటే ఒప్పందానికి కట్టుబడి ఉండటమే సరైన నిర్ణయం అవుతుందనేది నా ఉద్దేశం. కాబట్టి, దగ్గరి భవిష్యత్తులో భారత్​ ఆర్​సెప్​లో భాగమవుతుందని ఆశిస్తున్నాం.

ఇదీ చూడండి:ప్రగతి సూచీల నేలచూపులు... 2019-20లో వృద్ధి 5శాతమే!

ABOUT THE AUTHOR

...view details