తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు- ఏర్పాట్లన్నీ సిద్ధం

వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంట్​ ముస్తాబైంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. కరోనా పరీక్షలు చేయించుకుని.. అందులో నెగెటివ్​ వస్తేనే సమావేశాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీల పీఏలకు పార్లమెంట్​ ఆవరణలోకి అనుమతి లేదు. మరోవైపు సభ్యులు కుర్చునే విధానంలోనూ అనేక మార్పులు చేశారు. ఇందుకు తగ్గట్టుగానే భారీ స్క్రీన్లను అవసరమైన ప్రదేశాల్లో అమర్చారు.

By

Published : Sep 14, 2020, 5:40 AM IST

parliament monsoon sessions to start today
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు- ఏర్పాట్లన్నీ సిద్ధం

నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనా వేళ నిర్వహిస్తున్న తొలి పార్లమెంట్​ సమావేశాలు ఇవే కావడం వల్ల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాలు.. ఈ ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించి ట్రయల్​ రన్​లను కూడా నిర్వహించారు.

ఉదయం రాజ్యసభ...

సాధారణ పరిస్థితుల్లో లోక్​సభ, రాజ్యసభలు ఏకకాలంలో జరుగుతూ ఉండేవి. కరోనా నేపథ్యంలో ఉభయ సభల సమయాల్లోనూ మార్పులు చేశారు. తొలి రోజు ఉదయం లోక్​సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరగనుంది. ఆ తర్వాత నుంచి ఉదయం 11గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2గంటలకు లోక్​సభ సమావేశమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు.

ఈ నేపథ్యంలో ఈసారి ఉభయసభల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతల వంటి అస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా సిద్ధమయ్యాయి.

ఏర్పాట్లు ఇలా...

భౌతిక దూరం నియమాన్ని పక్కగా పాటించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సభ్యులు కూర్చునేందుకు ఛాంబర్లు, గ్యాలరీలను ఉపయోగించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మాట్లాడే సభ్యులను చూపించేందుకు నాలుగు పెద్ద స్క్రీన్లను ఛాంబర్లలో పెట్టారు. మరో ఆరు చిన్న స్క్రీన్లు, ఆడియో సెట్లను నాలుగు గ్యాలరీల్లో ఉంచారు.

పత్రాల వినియోగాన్ని కూడా పరిమితం చేశారు అధికారులు. ఎలక్ట్రానిక్​ పరికరాల ద్వారా బిల్లులు, ఆర్డినెన్సులు తదితర పేపర్లను పంపిణీ చేయనున్నారు. సభ్యులు సొంతంగా ఈ-రీడర్​ పరికరాలను తెచ్చుకునేందుకు కూడా అనుమతినిచ్చారు.

నెగెటివ్​ వస్తేనే...

మరోవైపు సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 72 గంటల ముందుగానే ఈ పరీక్షలు జరగాలని... అందులో నెగెటివ్​ వచ్చిన వారికే సమవేశాలకు అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. వీటితో పాటు పార్లమెంట్​ సభ్యుల వ్యక్తిగత సిబ్బంది, ఇంట్లో పనిచేసే వారు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

వారిపై ఆంక్షలు...

కరోనా ప్రభావం నేపథ్యంలో పార్లమెంట్​ ఆవరణలోకి ప్రవేశంపైనా ఆంక్షలు విధించారు అధికారులు. ఎంపీల పీఏలు, పీఎస్​లకు ప్రవేశాన్ని నిషేధించారు. మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి కూడా నామమాత్రంగానే అనుమతినిచ్చారు. సభా కార్యకలాపాల్లో భాగమైన అధికారులు మినహా ఎవరికి అనుమతినివ్వలేదు. ఎంపిక చేసిన మీడియా సంస్థల ప్రతినిధులు మాత్రమే పార్లమెంటు ఆవరణలో సమావేశాల కవరేజి చేయవచ్చని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details