తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2021, 10:48 PM IST

ETV Bharat / bharat

భారత్​లో టీకా పంపిణీ- తొలిరోజు విజయవంతం

కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారతావని శ్రీకారం చుట్టింది. సరైన చికిత్స, ఔషధం లేని పరిస్థితుల నుంచి నేటి వరకూ ఎనలేని ధైర్యంతో వైరస్‌పై ముందుండి పోరాడుతున్న కరోనా యోధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా వేయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 3 వేల 351 ప్రాంతాల్లో తొలిరోజు లక్షా 91 వేల 181 మందికి టీకా వేశారు.

Over 1.6 lakh frontline workers get first jabs as India rolls out world's largest inoculation programme against COVID-19
టీకా పంపిణీ తొలిరోజు విజయవంతం

భారత్‌లో చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టంచేసింది. శనివారం 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది. అయితే, కొవిన్‌ యాప్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడం వల్ల కొన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆలస్యమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది. మరోవైపు టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా టీ కా పంపిణీ
రాష్ట్రాల వారీగా టీ కా పంపిణీ

వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను ప్రారంభించిన ప్రధాని

టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఒకేసారి రెండు దేశీయ తయారీ టీకాలు ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలు అన్ని విధాల ప్రశంసనీయులని అన్నారు. టీకాల తయారీతో దేశ శాస్త్రవేత్తలు.. భారత సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. కరోనా టీకా రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్న మోదీ.. మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ తరుణంలో ఏడాదిగా కరోనా పోరులో భారత పాత్రను గుర్తుచేసుకుంటా భావోద్వేగానికి లోనయ్యారు.

టీకా పంపిణీ కార్యక్రమంలో మోదీ

మొదటి టీకా వారికే..

దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో కేంద్రం చెప్పినట్లుగానే తొలి టీకాని పారిశుధ్య కార్మికులకు వేశారు. కరోనా కష్టకాలంలో ముందుండి నడిపించిన కరోనా వారియర్స్​కు దేశంలోని అనేక రాష్ట్రాల్లో తొలిటీకా వేశారు. దిల్లీలో పారిశుధ్య కార్మికుడు మనీష్ కుమార్​కు ఎయిమ్స్ వైద్యులు తొలి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

టీకా ప్రారంభోత్సవం సందర్భంగా
తొలి టీకా పొందిన తొలి పారిశుద్ధ్య కార్మికుడు

టీకా పంపిణీల పై సమీక్షలు..

గుజరాత్​ అహ్మదాబాద్​లోని ప్రజా వైద్యశాలలో ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్​ పటేల్​ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్​ ప్రారంభించారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని బలరాంపుర్​ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమక్షంలో టీకాలను వేశారు. ఈ ఆసుపత్రిలో ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్​ వేయనున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడులో చెన్నైలోని రాజీవ్​ గాంధీ జనరల్​ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలను అందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ సమయంలో అక్కడే ఉండి వారిలో ధైర్యం నింపారు. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. మొహలీలో టీకా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.

టీకా వేయించుకున్న ప్రముఖులు వీరే..

తొలి రోజు ఇద్దరు రాజకీయ నాయకులు కూడా టీకాలు వేయించుకున్నారు. భాజపా ఎంపీ మహేశ్‌ శర్మ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ ఛటర్జీ దేశంలోనే తొలి టీకా వేయించుకున్న రాజకీయ నేతలుగా నిలిచారు. దేశంలో కొవిషీల్డ్​ టీకాను ఉత్పత్తి చేసిన సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా​ కూడా వ్యాక్సిన్​ తీసుకున్నారు. దిల్లీ ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​దీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ టీకాలు తీసుకున్నారు.

టీకా తీసుకుంటున్న ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​దీప్​ గులేరియా
టీకా వేయించుకుంటున్న ఎంపీ మహేశ్​ శర్మ

భూటాన్​ ప్రధాని అభినందనలు..

భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంపై భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌ అభినందనలు తెలిపారు. కొవిడ్‌పై పోరులో భారత్​ గొప్ప ముందడుగు వేసిందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా కష్టాలకు వ్యాక్సిన్‌ ప్రక్రియతో ముంగిపు పలకబోతున్నమని వ్యాఖ్యానించారు.

పంపిణీపై ఎవరేమన్నారు..?

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని 'రెడ్​ లెటర్​ డే(గొప్ప కార్యం జరిగిన రోజు)' గా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని నూతన భారతం విపత్కర పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుంటోందని అమిత్​ షా తెలిపారు. ఈ మేడ్​ ఇన్​ ఇండియా వ్యాక్సిన్​ ఆత్మనిర్భర్​ భారత్​కు నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్​ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా భారత్​కు అభినందనలు తెలిపారు మంత్రి హర్షవర్ధన్​. ఈ క్రమంలో పలువురు సీఎంలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.

ట్విట్టర్​ ట్రెండింగ్​గా 'లార్జెస్ట్​ వ్యాక్సిన్ డ్రైవ్'

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 'లార్జెస్ట్ వ్యాక్సిన్‌ డ్రైవ్' పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండగా.. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన గంటల వ్యవధిలోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. 4.3లక్షల ట్వీట్లతో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.

ఇదీ చూడండి:కరోనా టీకా పంపిణీపై సైకత శిల్పం

ABOUT THE AUTHOR

...view details