తెలంగాణ

telangana

By

Published : May 13, 2019, 5:40 AM IST

ETV Bharat / bharat

'మోదీవి తప్పుడు, హాస్యాస్పద వ్యాఖ్యలు'

బాలాకోట్​పై మెరుపుదాడిలో భారత యుద్ధవిమానాలను పాకిస్థాన్​ రాడార్లు గుర్తించకుండా మేఘాలు సహాయపడతాయని తాను వాయుసేనకు సలహా ఇచ్చానని, అందువల్లే ఆ దాడి విజయవంతమైందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశాయి.

'మోదీవి తప్పుడు, హాస్యాస్పద వ్యాఖ్యలు'

'మోదీవి తప్పుడు, హాస్యాస్పద వ్యాఖ్యలు'

పాకిస్థాన్​లోని బాలాకోట్​పై భారత వాయుసేన చేసిన మెరుపుదాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశ రక్షణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మోదీ ఉల్లంఘించారని ఆరోపించాయి.

బాలాకోట్​పై భారత వాయుసేన చేసిన మెరుపుదాడిలో మన యుద్ధవిమానాలను పాకిస్థాన్​ రాడార్లు గుర్తించకుండా మేఘాలు సహాయపడతాయని వాయుసేనకు సలహా ఇచ్చానని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. మోదీ తప్పుడు, హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాయి. సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశ రక్షణకు ముప్పు

దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సైనిక చర్యల​ కార్యాచరణ వివరాలను మోదీ వెల్లడించడం సిగ్గుచేటని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఓ టీవీ కార్యక్రమంలో ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీకి ఫిర్యాదు చేసింది సీపీఎం.

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

" ఐదేళ్ల నుంచి మోదీ అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. మేఘావృత వాతావరణం తనను రాడార్లు గుర్తించకుండా కాపాడుతుందని అనుకుంటున్నారు." - కాంగ్రెస్ ట్వీట్​

ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తిప్పికొట్టారు.

"బాలాకోట్​ మెరుపుదాడి వివరాలు ప్రధాని మోదీ వెల్లడించలేదు. ఆయనకు ఆ అవసరం లేదు."-ప్రకాశ్​ జావడేకర్​, భాజపా నేత, కేంద్రమంత్రి

అది నా సలహానే

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని బాలాకోట్​పై మెరుపుదాడి చేయాలని నిర్ణయించింది వాయుసేన. అయితే దాడి సమయంలో వాతావరణం బాగాలేకపోయినా తన సలహా మేరకే వాయుసేన మెరుపుదాడి చేసినట్లు మోదీ ఓ టీవీ ఛానల్​ ఇంటర్వ్యూలో చెప్పారు.

"బాలాకోట్​పై మెరుపుదాడి చేయాలనుకునే సమయానికి వాతావరణం అనుకూలంగా లేదు. అందువల్ల ఆ దాడిని మరో రోజుకు వాయిదా వేయాలని నిపుణులు భావించారు. అయితే మన యుద్ధ విమానాలను పాకిస్థాన్​ రాడార్లు గుర్తించకుండా మేఘాలు సహాయపడతాయని నేను సూచించాను." - ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

యుద్ధవిమానాల జాడను రాడార్లు గుర్తించకుండా... మేఘాలు అడ్డుకోలేవని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: "కాంగ్రెస్​ హిందూ సంస్కృతిని అవమానించింది"

ABOUT THE AUTHOR

...view details