జేఎన్యూలో విద్యార్థులపై దాడి, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సహా దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు.. విపక్షాలు రేపు సమావేశం కానున్నాయి.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. సీఏఏపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే... ఈ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకావడం లేదని సమాచారం. భారత్ బంద్ సందర్భంగా బంగాల్లో వామపక్షాలకు, తృణముల్ నేతలకు ఘర్షణలు జరిగిన నేపథ్యంలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు దీదీ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాజస్థాన్లోని కోటాలో చిన్నారుల మరణాలపై కాంగ్రెస్ను విమర్శించిన మాయవతి సైతం.. భేటీకి దూరంగా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:'కొంతమంది వామపక్ష విద్యార్థులతో విద్యా వ్యవస్థకు దెబ్బ'