తెలంగాణ

telangana

కాస్త కుదుటపడ్డ దిల్లీ- అల్లర్లకు 24 మంది బలి

By

Published : Feb 26, 2020, 6:48 PM IST

Updated : Mar 2, 2020, 4:03 PM IST

సీఏఏపై జరిగిన అల్లర్లతో అట్టుడుకిన ఈశాన్య దిల్లీలో పరిస్థితులు ఈరోజు మెరుగుపడ్డాయి. ఉదయం పలు చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా హింస జరగలేదు. అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 24కు చేరింది. పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దేందుకు జాతీయ భద్రతా సలహాదారు స్వయంగా రంగంలోకి దిగారు. అటు... దిల్లీ అల్లర్లపై రాజకీయంగా దుమారం రేగింది.

delhi situation
northeast delhi situation

కాస్త కుదుటపడ్డ దిల్లీ

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో గత రెండు రోజులుగా రణరంగాన్ని తలపించిన ఈశాన్య దిల్లీలో ఈరోజు పరిస్థితులు కుదుటపడ్డాయి. పలు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా హింస జరగలేదు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఉదయం నుంచే భారీగా బలగాలను మోహరించింది.

అల్లర్లు జరిగిన ఈశాన్య దిల్లీలోని మౌజ్​పుర్​ ప్రాంతంలో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​. స్థానికులతో ముచ్చటించి భరోసా నింపే ప్రయత్నం చేశారు. మనమంతా భారతీయులమని, కలసిమెలసి దేశాభివృద్ధికి పాటు పడాలని సూచించారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్​షాను కలిసి ప్రస్తుత పరిస్థితిపై నివేదించారు.

ఇదీ చూడండి: గ్రౌండ్​ జీరోలో డోభాల్​- స్థానికుల్లో భరోసా నింపే యత్నం

ఈశాన్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈశాన్య దిల్లీలో దుకాణాలు మూతపడి రోడ్లు బోసిపోయాయి. పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి స్థానికులు ఇబ్బందిపడుతున్నారు.

మోదీ ట్వీట్, షా సమీక్షలు..

ఈశాన్య దిల్లీ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా ప్రజలను అభ్యర్థించారు. పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీ అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దిల్లీలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు హోమంత్రి అమిత్​ షా.. అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

రాజకీయ దుమారం

  • దిల్లీలో హింసకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
  • సోనియా ఆరోపణలను భాజపా ఖండించింది. హింసాత్మక ఘటనలతో రాజకీయాలు చేయడం తగదని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ హితవు పలికారు.
  • దిల్లీలో పరిస్థితిని పోలీసులు అదుపు చేయలేకపోయారని, సైన్యాన్ని రంగంలోకి దింపాలని అరవింద్​ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
  • దిల్లీ అల్లర్లను నిరసిస్తూ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. గాంధీ స్మతి వరకు తలపెట్టిన ర్యాలీని జన్​ఫథ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చూడండి:దిల్లీ హింసపై కాంగ్రెస్ శాంతియుత నిరసన

దిల్లీ హైకోర్టు స్పందన..

  • బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వాధినేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని దిల్లీ హైకోర్టు నిర్దేశించింది. దేశంలో 1984 నాటి పరిస్థితులు పునరావృతం కానివ్వమని స్పష్టం చేసింది.
  • ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని ప్రజలను కలిసి, వారికి భరోసా కల్పించాలని నిర్దేశించింది దిల్లీ హైకోర్టు. చట్టం అమలు అవుతోందని వారికి అర్థమయ్యేలా చేయాలని సూచించింది.
  • క్షతగాత్రులకు పోలీసులు సాయం చేసిన తీరును ప్రశంసించింది దిల్లీ ఉన్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి: 'కపిల్ మిశ్రాపై ఎఫ్​ఐఆర్​ నమోదును పరిశీలించండి'

Last Updated : Mar 2, 2020, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details