తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదరికంపై​ ప్రయోగాల ఫలితం నోబెల్ పురస్కారం

ప్రపంచంలో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు భిన్న ప్రణాళికలతో ప్రభుత్వాలకు సహకరించినందుకు ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్​ బెనర్జీతో పాటు ఆయన భార్య డఫ్లో, మైఖేల్​ క్రెమర్​లకు నోబెల్​ పురష్కారం వరించింది. సమస్య లోతుల్లోకి వెళ్లకుండా ఫథకాలు సృష్టిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని, భిన్న ప్రయోగాలతో ముందడుగు వేసి పేదరికాన్ని రూపుమాపేందుకు కృషి చేసినందుకు ఈ బహుమతి దక్కింది.

By

Published : Oct 15, 2019, 4:14 PM IST

పేదరికంపై​ ప్రయోగాల ఫలితం నోబెల్ పురష్కారం​

ప్రపంచవ్యాప్తంగా పదుల కోట్లమంది అభాగ్యుల జీవితాలతో నిరంతరం మృత్యుక్రీడలాడుతున్న నిశ్శబ్ద హంతకి పేరు పేదరికం. అభివృద్ధికి ఆఘాతంగా, సమర్థ మానవ వనరుల వికాసానికి విఘాతంగా మారిన పేదరికాన్ని పరిమార్చడానికంటూ భిన్న పథకాలు ప్రణాళికలతో ప్రభుత్వాలు సాగిస్తున్న పోరు సత్ఫలితాలివ్వడం లేదన్నది నిష్ఠుర సత్యం. ప్రపంచవ్యాప్త పేదరికంపై పోరాటానికి అనుసరించాల్సిన అత్యుత్తమ మార్గాలేమిటో తెలుసుకొనేలా సరికొత్త విశ్వసనీయ విధానాల్ని పరిచయం చేసినందుకు ఈ ఏడాది అభిజిత్‌ బెనర్జీ, ఈస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది. ముంబయిలో పుట్టి, అప్పటి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పొంది, దిల్లీలోని జేఎన్‌యూలో స్నాతకోత్తర చదువు పూర్తిచేసి, విఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేసిన అభిజిత్‌ బెనర్జీకి, ఆయన సతీమణి డఫ్లోకు నోబెల్‌ పురస్కారం దక్కడం భారతీయులందర్నీ పులకితాంతం చేస్తోంది.

సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం

పేదరికం కొలమానాలపై విస్తృత పరిశోధనలకుగాను 2015లో అంగుస్‌ డీటన్‌కు ‘నోబెల్‌’ దక్కింది. సమస్య లోతుల్లోకి వెళ్లకుండా పేదరిక నిర్మూలన పేరిట లెక్కకు మిక్కిలి పథకాలు పెట్టి వేలకోట్ల రూపాయలు వ్యయీకరించడం వల్ల ప్రయోజనం లేదని, ఎక్కడ ఏయే వర్గాలకు వాస్తవికంగా ఏమేమి అవసరమో విశ్లేషించి తగు పరిష్కారాలతో ముందడుగేస్తే మంచి ఫలితాలు అందుకోగలమని అభిజిత్‌-డఫ్లో-క్రెమర్‌ల రెండు దశాబ్దాల ప్రయోగ ఫలితాలు నిర్ధారిస్తున్నాయి. అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పేదరిక కార్యాచరణ ప్రయోగశాలను 2003లో నెలకొల్పిన అభిజిత్‌ బెనర్జీ- పాఠశాలల్లో దిగనాసి విద్యాప్రమాణాలు, పిల్లల్లో అనారోగ్యం వంటి రుగ్మతలకూ మూలకారణాల్ని అన్వేషించి, వాటికి సరైన మందు వేయడం ద్వారా ముందడుగేయగలమని నిర్ద్వంద్వంగా నిరూపించారు. ఈ ముగ్గురు దిగ్దంతుల ప్రయోగశీల విధానాలు అభివృద్ధి ఆర్థికానికి కొత్తరెక్కలు తొడిగాయని నోబెల్‌ కమిటీ ప్రస్తుతిస్తుంటే, సూక్ష్మరుణాల పథకంపై అభిజిత్‌-డఫ్లోల ప్రాథమిక అధ్యయన కేంద్రం హైదరాబాదే కావడం తెలుగువారికీ ఆనందదాయకం అవుతోందిప్పుడు!

పేదరికాన్ని అర్థం చేసుకోకపోతే ప్రయోగాలు విఫలమే

పేదరికం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలన్నది ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొట్టమొదటిది. మానవాళిలో పదిశాతం, అంటే 70కోట్ల మందికిపైగా ప్రజలు దుర్భర పేదరికంలో అల్లాడుతూ ఆరోగ్యం, విద్య, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి కనీసావసరాలకూ నోచుకోవడం లేదన్న సమితి- 2030నాటికి కూడా పేదరిక సమూల నిర్మూలన సాధ్యమయ్యే వాతావరణం లేదని ఇటీవలే ప్రకటించింది. 55 శాతం జనావళికి సామాజిక భద్రతా కవచాలూ అందుబాటులో లేని తరుణంలో- గుడ్డెద్దు చేలో పడ్డ చందం కాకుండా పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజనదాయకంగా ఎలా వినియోగించగల వీలుందో అభిజిత్‌ బృందం ప్రయోగాలు కళ్లకు కడుతున్నాయి. పేదరికాన్ని విధానకర్తలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఆయా పథకాలు విఫలమవుతున్నాయనే అభిజిత్‌ బెనర్జీ- ‘ప్రపంచ పేదరిక పోరాట పంథా మీద విప్లవాత్మక పునరాలోచన’ పేరిట రాసిన పుస్తకం సంచలనం సృష్టించింది.

ప్రయోగాలతో పేదరికంపై విజయం

పేదరిక నిర్మూలన పథకాలు ఏమైనాగాని సరైన పరిశోధన, సక్రమ డేటాల ప్రాతిపదికన ఉండాలిగాని, సైద్ధాంతిక ప్రాతిపదికనో, అజ్ఞానంతోనో అమలుచేయడం అభివృద్ధిని దిగలాగుతుందని అభిజిత్‌ నిశ్చితాభిప్రాయం. గర్భిణులకు అయొడిన్‌ లోపాల్ని నివారించే ఆహారాన్ని ఇవ్వడం; పిల్లలకు నులిపురుగుల మందు అందించడం వంటి సామాజికారోగ్య చొరవతో మేలిమి ఫలితాలు సాధించగల వీలుందన్నది వారి సిద్ధాంతసారం! పాఠశాలల్లో బోధన మెరుగుదలకు అభిజిత్‌ బృందం అధ్యయనాలు ఉపకరించడంతో ఇండియాలో 50 లక్షలమందికి పైగా పిల్లలు లబ్ధి పొందారని, పలు దేశాలు రోగ నిరోధకత కోసం భారీ రాయితీలు ఇస్తుండటానికీ వారి నమూనాయే కారణమనీ నోబెల్‌ అకాడమీ ప్రస్తుతిస్తోంది!

పేదరిక నిర్మూలనలో అమర్త్యసేన్​ కృషి

ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం భారతమ్మ ముద్దుబిడ్డడు అమర్త్యసేన్‌ను వరించింది. 1943లో బెంగాల్‌ను వణికించిన డొక్కల కరవు 30 లక్షల మందిని బలిగొన్న సమయానికి తొమ్మిదేళ్ల పిల్లాడైన అమర్త్యసేన్‌- సంక్షేమ ఆర్థికానికి గొడుగుపట్టే సిద్ధాంతంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించి సాధించిన విజయమది! కరవు కాటకాల్ని పసిగట్టి వాటి తీవ్రతను తగ్గించేలా కృషి చెయ్యడంతోపాటు, పేదరికాన్ని అంచనా కట్టే విధానాల కూర్పు ద్వారా ప్రభావాన్విత సామాజిక కార్యక్రమాల అమలుకు అమర్త్యసేన్‌ పరిశోధనలు దోహదపడ్డాయి. నేడు అభిజిత్‌-డఫ్లో-క్రెమర్‌ పరిశోధనలు మరింత ముందడుగేసి కచ్చితంగా ఫలితాలు రాబట్టగలిగేలా పేదరికం, అవిద్య, అనారోగ్యం వంటి రోగాలకు కాదు- ఆయా రోగగ్రస్తులకు హోమియోపతిలో మాదిరిగా స్వభావ వైద్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి!

అభిజిత్​ వ్యూహాలతో ప్రభుత్వాలకు సూచనలు

పేదరికంపై పోరాటంలో విజయం సాధించగలమంటూనే అందుకు ఓర్పు, సరైన ఆలోచన, గతానుభవాలనుంచి గుణపాఠాలు నేర్వడం ఎంతో కీలకమన్నది వారి ప్రయోగాల సారాంశం. నిరుపేదలనే ఓటుబ్యాంకులుగా మార్చుకొని, ఖజానాల ఆర్థిక సత్తువతో నిమిత్తం లేకుండా చేతికి ఎముకే లేనట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమలులో ప్రభుత్వాల పోటాపోటీ- పేదరికాన్ని ప్రవర్ధమానం చేస్తున్న రోజులివి. లక్షిత వర్గాలను నిక్కచ్చిగా గుర్తించడం, అందులోనూ ఎవరి అవసరాలేమిటో సక్రమంగా మదింపు చెయ్యడం, పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజనకరంగా వినియోగించే సుదృఢ రాజకీయ సంకల్పం కలిగిఉండటం- అభిజిత్‌ బృందం ప్రతిపాదిస్తున్న ‘పేదరికంపై పోరాట వ్యూహా’నికి నిచ్చెన మెట్లు. ఈ ‘నోబెల్‌’ సూచనను ప్రభుత్వాలు ఔదలదాల్చడం నేటి అవసరం!

ABOUT THE AUTHOR

...view details