తమిళనాడు తిరుప్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తోన్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలు.. తన కూతురిని చూసుకునే వారు లేక చెత్తబుట్టలో ఉంచి పనులు చేస్తోంది. చెత్త బండిపై ఉన్న డబ్బాల్లో ఒకదాంట్లో చిన్నారిని ఉంచి రోడ్డుపై తోసుకుంటూ చెత్త సేకరిస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
మహారాష్ట్రకు చెందిన సుజాత అనే మహిళ తమిళనాడు తిరుప్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు తమిళ భాష రాదు. పనిలోకి వెళ్లిన సమయంలో తన కూతురిని చూసుకునేందుకు నా అన్నవారు ఎవరూ లేరు. చేసేది ఏమీ లేక కూతురిని తనతోపాటే తీసుకెళ్లేది.
సుజాతకు ఇచ్చిన చెత్త బుట్టల్లోని ఒకదాంట్లో చిన్నారని ఉంచి బండిని తోసుకుంటూ చెత్త సేకరిస్తోంది. చెత్త డబ్బాల్లో చిన్నారి ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఈ విషయం తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ విజయ కార్తికేయన్ వరకు చేరింది. స్పందించిన కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలను చూసుకునేందుకు వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.