తెలంగాణ

telangana

ఎన్ని 'మహా' భేటీలు జరిగినా వీడని ప్రతిష్టంభన

By

Published : Nov 4, 2019, 11:23 PM IST

Updated : Nov 5, 2019, 7:31 AM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. గవర్నర్​తో శివసేన నేత రౌత్​, సోనియాతో శరద్​ పవార్​, అమిత్​ షాతో ఫడణవీస్​ భేటీ అయ్యారు. అయినా మహా ప్రతిష్టంభనలో ఎలాంటి మార్పు కనపించలేదు.

ఎన్ని 'మహా' భేటీలు జరిగినా వీడని ప్రతిష్టంభన

మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం పలు కీలక భేటీలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. శివసేన నేత సంజయ్​ రౌత్.. మహారాష్ట్ర గవర్నర్​తో భేటీ అయ్యారు. సోనియా గాంధీతో దిల్లీలో సమావేశమయ్యారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారు.

'భాజపాదే బాధ్యత'

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యత భాజపాదేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ మద్దతుకోరలేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీతో.. దిల్లీ టెన్‌ జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు పవార్​. కాంగ్రెస్- ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోనియాతో పవార్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మాత్రమే సోనియాతో చర్చించినట్లు చెప్పారు పవార్. ప్రభుత్వ ఏర్పాటు అంశం చర్చకు రాలేదని.. త్వరలోనే మరోమారు భేటీ అవుతామన్నారు.

అనంతరం మీడియాతో సమావేశమయ్యారు పవార్​. మహారాష్ట్ర ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండమని తీర్పునిచ్చారని పునరుద్ఘాటించారు. అయితే భవిష్యత్తు గురించి ముందుగా మాట్లాడలేమన్నారు.

గవర్నర్​ను కలిసిన సంజయ్​ రౌత్​

ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. గవర్నర్ భగత్‌ సింగ్ కోషియారీతో భేటీ అయ్యారు శివసేన సీనియర్‌ నేత సంజయ్‌రౌత్‌. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితికి సేన కారణం కాదని గవర్నర్‌కు వివరించినట్లు భేటీ అనంతరం తెలిపారు రౌత్​. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన ఎంతమాత్రం అడ్డుకాదన్నారు. ఎవరికి మెజారిటీ ఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని గవర్నర్ అన్నట్లు తెలిపారు. మెజారిటీ ఉందంటూ ఏ రాజకీయ పార్టీ తనను సంప్రదించలేదని గవర్నర్ చెప్పినట్లు వివరించారు. తమకు 170మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని రౌత్​ ప్రకటించిన మరుసటి రోజే గవర్నర్‌ను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమిత్​ షాతో ఫడణవీస్ భేటీ...

భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో దిల్లీలో భేటీ అయ్యారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే శివసేన మద్దతు విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సాయం అందించాలనే అంశంపై చర్చించేందుకు షాతో సమావేశమైనట్లు భేటీ అనంతరం ట్వీట్ చేశారు ఫడణవీస్​. బీమా సంస్థలతో కేంద్రం భేటీ అయ్యి రైతులకు అధిక సాయం అందించేందుకు.. నిబంధనలను సడలించేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు.

మళ్లీ ఎన్నికలు!

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని కొందరు స్థానిక భాజపా నేతలు కోరుతున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైకుమార్‌ రావల్‌ తెలిపారు. ధూలే జిల్లాలో ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు కొందరు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పారు. శివసేనతో భాజపా కలహాల పొత్తు పెట్టుకోకూడదని మరోసారి ఎన్నికలకు వెళ్తే గెలిచి చూపిస్తామని ఆ నేతలు సూచించినట్లు వెల్లడించారు. శివసేనతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లో పోటీ చేయలేకపోయామనే నిరాశ భాజపా నేతల్లో ఉన్నట్లు రావల్‌ వెల్లడించారు. కొన్ని చోట్ల భాజపా స్వల్ప తేడాతో ఓడిన విషయాన్ని గుర్తు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన వేర్వేరుగా పోటీ చేయగా...ఈసారి కలిసి బరిలోకి దిగాయి. భాజపాకు 105 సీట్లు రాగా, శివసేన 56 స్థానాలు కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి: 'శబరిమలకు మహిళల నిషేధం సాధ్యం కాదు'

Last Updated : Nov 5, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details