ప్రధామంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆమె రెండోసారి కేంద్రమంత్రి పదవిని అలంకరించారు.
రైల్వే మంత్రిగా మళ్లీ..
గతంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పియూష్ గోయల్కు తిరిగి అదే శాఖ దక్కింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సురేష్ ప్రభు ఆయనకు స్వాగతం పలికారు.
జల్శక్తి మంత్రిగా గజేంద్ర సింగ్
నీటివనరులు, ఇతర పలు శాఖల మేళవింపుతో కొత్తగా ఏర్పాటు చేసిన జల్శక్తి శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెఖావత్ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని శ్రమ శక్తి భవనంలో బాధ్యతలు స్వీకరించారు.
చమురు, సహజ వాయువు మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్
పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్
గతంలో విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి అనూహ్యంగా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సుబ్రమణ్యం జైశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.