నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్ జారీ అంశంపై.. దిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో వాదనలు ముగిశాయి. దోషుల పిటిషన్లు తమ వద్ద పెండింగ్లో ఉన్నప్పటికీ.. డెత్ వారెంట్ జారీ చేయొచ్చని ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినందున.. నిందితులకు కొత్తగా ఉరిశిక్ష తేదీలు ఖరారు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం.. దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తరఫున వాదించేందుకు బృందా గ్రోవర్ స్థానంలో రవి ఖాజిని నియమించింది. అయితే తన తరఫున వాదించేందుకు న్యాయవాది అవరసం లేదని కోర్టుకు తెలిపాడు ముకేశ్.
మరో దోషి అయిన అక్షయ్.. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. గతంలో దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్కు అన్ని పత్రాలు జోడించలేదని తెలిపిన ఆయన.. పూర్తి వివరాలతో మరోసారి రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నట్లు కోర్టుకు విన్నవించారు. నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్ శర్మ.. తిహార్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్నాడని ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం వినయ్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించాలని అధికారులను ఆదేశించింది కోర్టు.
"వినయ్ ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వినయ్పై జైలులో శారీరక దాడి చేశారు. అతని తలపై గాయాలున్నాయి. పవన్ గుప్తా కూడా రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయనున్నాడు. అలాగే సుప్రీంకోర్టులో క్యురేటివ్ వ్యాజ్యం వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు."
- ఏపీ సింగ్, దోషుల తరఫు న్యాయవాది