తెలంగాణ

telangana

టెలికం సంస్థలకు కొన ఊపిరి దశలో కొత్త ఉత్తేజం?

By

Published : Nov 25, 2019, 7:11 AM IST

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎమ్‌టీఎన్‌ఎల్‌) సంస్థల్ని విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే చాలా ఆలస్యమైందనే భావన నెలకొంది. ఇది రెండు సంస్థల పునరుత్తేజానికి దోహదపడకున్నా, ప్రైవేటు సంస్థలకు కొంతమేర పోటీని సృష్టిస్తుండవచ్చని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండింటి విలీనం వంటివి నిర్వహణ వ్యయాలకు కొంతమేర అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అంతేతప్ప పూర్తిస్థాయిలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం లేదనే చెప్పాలి.

కొన ఊపిరి దశలో కొత్త ఉత్తేజం?

నష్టాల బారిన పడిన ప్రభుత్వరంగ టెలికం సంస్థల భవిష్యత్తు ఏమిటి? పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికలు ఫలితాల్ని ఇస్తాయా, భారీస్థాయిలో సాగే ఈ కసరత్తు బూడిదలో పోసే పన్నీరే అవుతుందా, కొత్త జీవం పోసుకుని మార్కెట్‌లో పోటీ పడతాయా... ఇప్పుడీ ప్రశ్నలన్నీ చర్చనీయాంశాలుగా మారాయి. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎమ్‌టీఎన్‌ఎల్‌) సంస్థల్ని విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే చాలా ఆలస్యమైందనే భావన నెలకొంది.

ఇది రెండు సంస్థల పునరుత్తేజానికి దోహదపడకున్నా, ప్రైవేటు సంస్థలకు కొంతమేర పోటీని సృష్టిస్తుండవచ్చని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే భారీ సంస్కరణలకు, పూర్తిస్థాయిలో పునర్నిర్మాణ ప్రక్రియకు తెరతీసి ఉండాల్సింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత చర్యలు ఈ సంస్థల్ని గాడిన పెట్టేందుకు సరిపోవు. ఈ రెండు సంస్థలు నిర్వహణ పరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతిపాదిత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ప్యాకేజీతోపాటు రెండింటి విలీనం వంటివి నిర్వహణ వ్యయాలకు కొంతమేర అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అంతేతప్ప, పూర్తిస్థాయిలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం లేదనే చెప్పాలి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒకప్పుడు నవరత్న కంపెనీ. తరవాతి కాలంలో రూ.90 వేలకోట్ల నష్టాల బారిన పడటంతో ఖాయిలా బాట పట్టింది. ఫలితంగా, రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ వంటి సమర్థ ప్రైవేటు సంస్థలతో పోటీ పడలేకపోయింది. 1.76 లక్షల మంది ఉద్యోగశక్తి ఉన్నా బరిలో నిలవలేక చతికిలపడింది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌లోని ఉద్యోగులు ఆ సంస్థలు మార్కెట్‌లో ఆధిపత్యం చలాయించిన రోజులనాటికి చెందినవారు కావడమే అతిపెద్ద సమస్య అని టెలికం రంగ నిపుణుల అభిప్రాయం.

ప్రస్తుత కాలంలో నెలకొన్న అతి తీవ్ర పోటీ వాతావరణానికి అనుగుణంగా సంస్థలు తమ వైఖరిని మార్చుకోవడంలో విఫలం కావడమే పెద్ద సమస్యగా చెబుతున్నారు. క్షీణతకు ప్రధాన కారణాల్లో ఇదొకటని స్పష్టం చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల రంగంలో తీవ్ర పోటీ కారణంగా ధరలు తగ్గడం, సిబ్బందికయ్యే వ్యయం అధికంగా ఉండటం, డేటా ఆధారిత టెలికం విపణిలో కొన్నిచోట్ల తప్పించి 4జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురాలేకపోవడం... వంటివన్నీ బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రధాన కారణాలు.

2016లో జియో అత్యంత దూకుడుగా మార్కెట్‌లోకి ప్రవేశించడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆదాయాలకు భారీగా గండి పడింది. జియో తన తగ్గింపు ధరలు, దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌తో టెలికం పరిశ్రమను కుదిపేసింది. 2016 ద్వితీయార్ధం నుంచి జియో 4జీ సేవలతో మొబైల్‌ ఫోన్లలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా జియో ప్రవేశం తరవాత అప్పటికే ఉన్న సంస్థల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా టెలికం రంగంలోని సంస్థలు ఏకీకరణ దిశగా అడుగులు వేయక తప్పలేదు. ఇప్పుడు, బీఎస్‌ఎన్‌ఎల్‌/ ఎమ్‌టీఎన్‌ఎల్‌ కాకుండా, వివిధ సంస్థల విలీనాల అనంతరం ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా వంటి మూడు ప్రైవేటు సంస్థలు మాత్రమే మిగిలాయి.

ఆర్థికాభివృద్ధికి అవసరం...

ప్రభుత్వరంగ టెలికం సంస్థల్ని ప్రస్తుత పోటీ విపణిలో నిలబెట్టేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌లను విలీనం చేయడంతోపాటు, 4జీ స్పెక్ట్రమ్‌ కోసం రూ.20,140 కోట్లు, వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) కోసం రూ.3,674 కోట్ల పెట్టుబడి సాయం, రూ.15 వేల రుణ సమీకరణకు ప్రభుత్వ హామీ, సిబ్బంది వీఆర్‌ఎస్‌కు రూ.12,768 కోట్లు, పదవీ విరమణ బాధ్యతలకు మరో రూ.17,160 కోట్లు, ఆస్తుల అమ్మకం ద్వారా రూ.38 వేలకోట్ల సముపార్జన, వచ్చే నాలుగేళ్ల కాలానికి ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ వంటి చర్యల్ని పునరుజ్జీవన ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించింది.

స్థూలంగా చూస్తే రెండు సంస్థల్ని కలిపేయడం హేతుబద్ధంగానే అనిపిస్తుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు, ఆర్థికంగా అంతగా లాభసాటికాని ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టే విషయంలో ప్రైవేటు ఆపరేటర్లను వాటి బ్యాలెన్స్‌షీట్లు వెనక్కి లాగుతుంటాయి. అందువల్ల ఒక బలమైన ప్రభుత్వరంగ సంస్థ రంగంలో ఉంటే, అది ప్రైవేటు కంపెనీల ధరల పెరుగుదలను నిరోధించడమే కాకుండా, గ్రామీణ వినియోగదారుల గురించీ పట్టించుకునేలా చేస్తుంది.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సురక్షితంగా, భద్రంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వర్తించే బలమైన ప్రభుత్వరంగ టెలికం సంస్థల అవసరం ఎంతైనా ఉంది. 2018లో ప్రారంభించిన జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ పాలసీ (ఎన్‌డీసీపీ)లో టెలికమ్యూనికేషన్ల విభాగం- మెరుగైన బ్రాడ్‌బ్యాండ్‌ విస్తరణ, రేడియో స్పెక్ట్రమ్‌ నిర్వహణ, జాతీయ టెలికం మౌలిక సదుపాయాలకు భద్రత పెంచడం, నెట్‌ న్యూట్రాలిటీ నియమాలకు కట్టుబడి ఉండటం వంటివి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ అంశాలుగా గుర్తించింది.

డిజిటల్‌ యుగంలో సమస్యల పరిష్కారానికి ఎన్‌డీసీపీ స్థూలంగా కనెక్ట్‌ ఇండియా, ప్రొపెల్‌ ఇండియా, సెక్యూర్‌ ఇండియా అనే మూడు కార్యక్రమాల్ని నిర్దేశించింది. సామాజిక ఆర్థికాభివృద్ధికి బ్రాడ్‌బ్యాండ్‌ను ఓ ఉపకరణంగా కనెక్ట్‌ ఇండియా ఉపయోగిస్తుంది. 5జీ, కృత్రిమమేధ, బిగ్‌డేటా వంటి కొత్త డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాల శక్తిని ఉపయోగించుకునే దిశగా ప్రొపెల్‌ ఇండియా కృషి చేస్తుంది. దేశంలో డిజిటల్‌ కమ్యూనికేషన్‌ భద్రతను, సార్వభౌమత్వ పరిరక్షణ దిశగా సెక్యూర్‌ ఇండియా తోడ్పడుతుంది. బలమైన ప్రభుత్వరంగ టెలికం సంస్థల ద్వారా 2022 నాటికి ఈ లక్ష్యాల్ని సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో చైనా గణనీయమైన పురోగతి సాధించింది.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించడంతోపాటు చైనా టెలికం సంస్థలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బహుళ లక్ష్యాల్ని సాధిస్తున్నాయి. చాలా దేశాల్లో ప్రభుత్వాలు టెలికం మౌలిక సదుపాయాలపై తమ పట్టును వదిలేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలను అనుమతిస్తున్నాయి. చైనా అలా చేయడం లేదు. ఆ దేశంలో ప్రభుత్వరంగంలోని టెలికం సంస్థలైన చైనా మొబైల్‌కు 65 శాతం, చైనా టెలికంకు 18 శాతం, చైనా యూనికం కంపెనీకి 17 శాతం వినియోగదారులున్నారు. దీంతో గత ఏడాది చివరినాటికి 4జీ ఎల్‌టీఈ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటింది.

ప్రపంచంలోని 4జీ వినియోగదారుల్లో 40 శాతం చైనాలోనే ఉన్నారు. భారత్‌లో ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు కేవలం 10 శాతం వైర్‌లెస్‌ చందాదారుల్ని, మూడు శాతం వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల్ని కలిగి ఉన్నాయి. భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) అంచనాల ప్రకారం 2019 మే నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 9.98 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఎమ్‌టీఎన్‌ఎల్‌తో కలిపితే ఇది 10.28 శాతం అవుతుంది. అత్యధిక మార్కెట్‌ వాటా ప్రైవేట్‌ ఆపరేటర్లదే. బీఎస్‌ఎన్‌ఎల్‌ నవరత్న హోదా నుంచి ఖాయిలాపడిన ప్రభుత్వరంగ సంస్థ స్థాయికి దిగజారింది.

దేశానికి ఎంతో మేలు..

కొన ఊపిరి దశలో కొత్త ఉత్తేజం?

దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ మనుగడ సాగించడం ఎంతైనా అవసరం. దేశంలోని వ్యూహాత్మక సంస్థలు, ప్రాంతాల్ని ఈ సంస్థ అనుసంధానిస్తుంది. దేశభద్రత విషయంలో కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ కీలకాంశం. ఇది ఇతర ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే పనికాదు. వరదలు, తుపాన్లు, ఇతర ప్రకృతి విపత్తులు ఎదుర్కొనే వేళ బీఎస్‌ఎన్‌ఎల్‌ ముందు నిలిచి ఉచిత సేవల్ని అందజేస్తుందని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కొనియాడటం ఇక్కడ ప్రస్తావనార్హం!

సత్వర సేవలు కీలకం...

4జీ స్పెక్ట్రమ్‌- కంపెనీల మధ్య పోటీని పెంచుతుందని ప్రభుత్వం పునరుద్ధరణ ప్రణాళికలో ఆశలు పెట్టుకుంది. అయితే, పోటీపడి పనిచేసేలా బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వసన్నద్ధమైందా అనేది అసలు సమస్య. కేవలం 4జీ సెక్ట్రమ్‌ మాత్రమే వినియోగదారుల్ని ఆకట్టుకోలేదు. సత్వర సేవలు అందిస్తేనే వినియోగదారులు ఆకర్షితులవుతారు. వినియోగదారులతో నేరుగా లావాదేవీలు నడిపే వ్యాపారాల్లో ప్రభుత్వరంగ సంస్థలు చాలామేర ఇబ్బంది పడుతుంటాయి.

వినియోగదారుల గిరాకీకి తగినట్లుగా వేగంగా ప్రతిస్పందించేలా కంపెనీల వ్యవహారాలు సాగాల్సిన అవసరముంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ సంస్థల సేవల్లో నాణ్యత లోపం వల్లే వినియోగదారులు పక్కకు జరిగారనే వాదన ఉంది. తీవ్ర పోటీ నెలకొన్న టెలికం విపణిలో పోటీపడే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం విశ్వసనీయమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. ఉదాహరణకు ఒక ప్రభుత్వరంగ సంస్థ పోటీదారుగా అవతరించాలంటే, దానికి ఎంతోకొంత స్వయంప్రతిపత్తి ఉండాలి.

కాలంచెల్లిన సాంకేతిక పరిజ్ఞానాలపైనే పెట్టుబడులు పెట్టడం, నాణ్యత లేని సెక్ట్రమ్‌ను ఎక్కువ ధరలకు కట్టబెట్టడం వంటి ప్రభుత్వ చర్యల కారణంగా, రెండు టెలికం సంస్థల పరిస్థితి నానాటికీ దిగజారిపోయింది. ఈ క్రమంలో సంరక్షణ ప్రణాళికతోపాటు టెలికం సంస్థల్లో పాలనపరమైన సంస్కరణలూ కీలకమే. పని సంస్కృతిలో మార్పు, పారదర్శకత, బాధ్యతాయుతత్వం పెరగడం అవసరం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్న తరుణంలో సంబంధిత సమస్యలన్నింటినీ సమగ్ర దృష్టికోణంలో చూడకపోతే, పరిరక్షణ ప్రణాళిక మరో వృథా కసరత్తుగా మిగిలిపోయే ముప్పుంది. సంస్కరణ, పునరుద్ధరణ ఒకే బాటన సాగకుంటే- రెండు టెలికం కంపెనీల ప్రస్థానం ముగిసినట్లే!

ఇదీ చూడండి:హోటళ్లలోనే ఎమ్మెల్యేలు... బలపరీక్షపై పార్టీల కసరత్తు

ABOUT THE AUTHOR

...view details