తెలంగాణ

telangana

బిహార్​లో తెరపైకి మరో కూటమి- 6 పార్టీలతో ఏర్పాటు

By

Published : Oct 9, 2020, 11:24 AM IST

బిహార్​లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మరో కొత్త కూటమి ఆవిర్భవించింది. ఎంఐఎం,ఆర్ఎల్ఎస్​పీ సహా 6 పార్టీలు ఇందులో జట్టుకట్టాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉపేంద్ర కుష్వహను ఎన్నుకున్నాయి. మరోవైపు.. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి మహారాష్ట్రకు చెందిన నేతలు సిద్ధమవుతున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్​.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

New alliance
బిహార్​లో తెరపైకి మరో కూటమి- 6 పార్టీలతో ఏర్పాటు

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకున్న వేళ.. 6 పార్టీలతో కొత్త కూటమి(ఫ్రంట్​​) గురువారం ఏర్పాటైంది. ఇప్పటికే అధికార ఎన్​డీఏ కూటమి, ప్రధాన ప్రతిపక్షాలతో కూడిన 'మహాకూటమి' ఎన్నికల బరిలో ఉన్నాయి. తాజాగా 'గ్రాండ్​ డెమొక్రటిక్​ సెక్యులర్​ ఫ్రంట్​' పేరిట మరో కూటమిని ఏర్పాటు చేసినట్లు రాష్ట్రీయ లోక్​ సమతా పార్టీ(ఆర్​ఎల్​ఎస్​పీ) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వహ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీలు ప్రకటించారు. ఈ కూటమికి దేవేంద్ర యాదవ్​ కన్వీనర్​గా వ్యవహరిస్తారని ఉపేంద్ర కుష్వహ తెలిపారు.

"ఎన్నికల్లో కొత్త కూటమికి ప్రజలు పట్టం కడితే ఉపేంద్ర కుష్వహ ముఖ్యమంత్రి అవుతారు. కొత్త కూటమి ద్వారా బిహార్​ ప్రజలకు మేము ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నితీశ్​ కుమార్​ 15 ఏళ్ల పాలనలో బిహార్​ ప్రజలు మోసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రత్యామ్నాయం అవసరం"

-- అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత

కొత్త కూటమిలో ఆర్​ఎల్​ఎస్​పీ, ఏఐఎంఐఎంలతో పాటు బీఎస్పీ, సుహేల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీ, సమాజ్​వాదీ జనతాదళ్​(డెమొక్రాటిక్​), జన్​తాంత్రిక్​ పార్టీ(సోషలిస్ట్​)లు భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ప్రచారానికి ఉద్ధవ్ ఠాక్రే

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు బిహార్​లో ప్రచారం చేయనున్న 22 మంది పార్టీ నేతల జాబితాను శివసేన గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉద్ధవ్​ కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు సంజయ్​ రౌత్​ తదితరులున్నారు. బిహార్​లో దాదాపు 50 స్థానాల్లో శివసేన పోటీకి దిగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్నికల బరిలో ఎన్​సీపీ

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్​ పవార్​ నేతృత్వంలోని నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) కూడా పోటీకి సిద్ధమవుతోంది. శరద్​ పవార్​ సహా 40 మందితో కూడిన ప్రచార సారథుల జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థలు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రచార సారథుల్లో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​.. ఎంపీలు ప్రఫుల్​ పటేల్​, సుప్రియా సూలే తదితరులున్నారు.

42 మందితో ఎల్​జేపీ జాబితా

బిహార్​ ఎన్నికల్లో తలపడనున్న లోక్​జన్​శక్తి పార్టీ (ఎల్​జేపీ) 42 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం విడుదల చేసింది. వీరంతా తొలిదశ ఎన్నికల్లో పోటీచేస్తున్నవారే. భాజపా నుంచి ఎల్​జేపీలో చేరిన కొందరు నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. వీరిలో కొద్ది రోజుల క్రితమే ఎల్​జేపీలో చేరిన కీలక నేతలు ఉషా విద్యార్థి, రాజేంద్ర సింగ్, రామేశ్వర్​ చౌరాసియా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని జేడీయూపై ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ మరోసారి ధ్వజమెత్తారు. ఆ పార్టీ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించారు. జేడీయూను ఓడించాలని పిలుపునిచ్చారు.

చిరాగ్​ లేఖ..

బిహార్​లో ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని ఎన్​డీఏను వీడటానికి ముందే లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ భాజపాకు తెలియజేశారు. ఈ మేరకు అనేక అంశాలను వివరిస్తూ చిరాగ్​ లేఖ రాశారు. ఆ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు.

ఇదీ చూడండి:బిహార్ బరి: కానిస్టేబుల్‌కు టికెట్‌.. డీజీపీకి నిరాశ!

ABOUT THE AUTHOR

...view details