తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 5:08 PM IST

Updated : Oct 8, 2020, 6:02 PM IST

ETV Bharat / bharat

టీఆర్​పీ స్కామ్​ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు

టీఆర్‌పీ రాకెట్‌ను బయటపెట్టారు ముంబయి పోలీసులు. కొందరికి డబ్బులు ఇచ్చి వాళ్ల ఛానళ్లు చూసేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Mumbai police unveil TRP rocket
టీఆర్​పీ రాకెట్​ బయటపెట్టిన ముంబయి పోలీసులు

మహారాష్ట్రలో టీఆర్‌పీ రాకెట్‌ను ముంబయి పోలీసులు బయటపెట్టారు. టీఆర్‌పీల విషయంలో కొన్నిఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని వెల్లడించారు. కొందరికి డబ్బులు ఇచ్చి... తమ ఛానళ్లు చూసేలా చేస్తున్నాయని తెలిపారు.

టీఆర్‌పీ కుంభకోణంలో ఇద్దరు వ్యక్తులను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రముఖ ఛానల్‌ సహా మూడు ఛానళ్లు ఈ టీఆర్‌పీ కుంభకోణానికి పాల్పడినట్లు ముంబయి పోలీసు కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు. విచారణలో భాగంగా ఆయా ఛానళ్ల బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తామన్నారు. టీఆర్‌పీ కుంభకోణంలో పాత్ర ఉన్న ఛానళ్ల‌ సిబ్బందిని విచారిస్తామని తెలిపారు. నేరాలకు పాల్పడినట్లు తేలితే ఆయా ఛానళ్ల బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేస్తామని స్పష్టంచేశారు పరమ్​వీర్​.

టీఆర్​పీ స్కామ్​ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు

"న్యూస్‌ ఛానళ్ల తరఫున పార్టీ కార్యకర్తలు కొందరు నెలవారీగా కొన్ని కుటుంబాలకు డబ్బులు ఇచ్చేవారు. కొన్ని ఛానళ్లను తమ ఇళ్లలో చూసేలా మోసాలకు పాల్పడేవారు. ఒక వ్యక్తిని పట్టుకున్నాం. అతని ఖాతా నుంచి రూ.20 లక్షలు స్తంభింపజేశాం. అతని లాకర్ నుంచి ఎనిమిదిన్నర లక్షలు జప్తు చేశాం. మా దర్యాప్తు ప్రకారం 3 ఛానళ్లు ఇలాంటి మోసానికి పాల్పడినట్లు తేలింది. అందులో రెండు చిన్న ఛానళ్లు. ఒకటి ఫక్త్‌ మరాఠి, ఇంకోటి బాక్స్‌ సినిమా. ఆ రెండు ఛానళ్ల యజమానులను అదుపులోకి తీసుకున్నాం. బార్క్‌ నివేదిక ప్రకారం రిపబ్లిక్‌ టీవీ పేరు ముందుకు వచ్చింది. అందులో అనుమానాస్పద టీఆర్‌పీ ట్రెండ్‌ కనిపించింది. ఈ అంశాలపై తదుపరి దర్యాప్తు జరుగుతుంది. "

- పరమ్‌వీర్‌ సింగ్‌, ముంబయి పోలీసు కమిషనర్‌

అంతా అసత్యం!

టీఆర్​పీ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను రిపబ్లిక్ టీవీ ఖండించింది. "నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నందుకే మాపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. సుశాంత్ కేసులో ముంబయి పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించినందుకే మాపై ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు" అని అన్నారు రిపబ్లిక్ టీవీ ప్రధాన సంపాదకులు అర్నాబ్ గోస్వామి.

ఇదీ చూడండి:కరోనా వేళ రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్!

Last Updated : Oct 8, 2020, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details