నాలుగేళ్ల తన కూతురిపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నాన్ని వమ్ము చేసింది దిల్లీలోని ఓ మహిళ. డబ్బులు దోచుకోవడానికి చిన్నారిని అపహరించాలని కుటుంబసభ్యుడే ఒడిగట్టిన ఈ పనిని ఆ తల్లి అడ్డుకుంది. కిడ్నాపర్ల చెర నుంచి తన కూతుర్ని విడిపించుకోవడం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. మంగళవారం జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
ఏంటి బాబాయ్ ఇదీ!
పోలీసుల కథనం ప్రకారం బాలికకు బాబాయ్ వరసయ్యే ఉపేందర్ ఈ కిడ్నాప్ ప్రణాళిక రచించాడు. బాలిక తల్లితండ్రుల నుంచి డబ్బులు దండుకునేందుకు ఈ పన్నాగం పన్నాడు. తన సోదరుడి నుంచి రూ.30 - రూ. 35 లక్షలు డిమాండ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. బాలికను అపహరించేందుకు ఇద్దరు మనుషుల్ని పంపించాడు. చివరకు ఈ ప్రయత్నం విఫలమై పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉపేందర్తో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తూర్పు దిల్లీ కృష్ణా నగర్ పోలీసులు తెలిపారు.
కిడ్నాపర్ల నుంచి తన కూతుర్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపేందర్ పంపిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని అపహరించడానికి ప్రయత్నించగా.. ఎవరి సహాయం లేకుండానే వారిని నిలువరించగలిగింది ఆమె. తన కూతుర్ని కిడ్నాపర్ల చేతుల నుంచి విడిపించుకుంది. అనంతరం వారిని ఆపేందుకు ప్రయత్నించింది. కిడ్నాపర్లు పారిపోయే సమయంలో చుట్టుపక్కల వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువురు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు.
నీళ్లు ఇవ్వమని అడిగి, అంతలోనే...
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైక్తో పాటు ఓ దేశీయ పిస్తోల్, నాలుగు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిందితులు బాధితురాలి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మంచినీరు కావాలని అడగితే.. నీళ్ల కోసం బాలిక తల్లి ఇంట్లోకి వెళ్లిందని... దీంతో బాలికను కిడ్నాప్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారని వెల్లడించారు. అయితే తల్లి మాత్రం సురక్షితంగా తన కూతుర్ని కాపాడుకుందని చెప్పారు.
వారం రోజుల నుంచి నిందితులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనానికి నకిలీ నెంబర్ తగిలించినట్లు చెప్పారు. అనంతరం విచారణలో ద్విచక్ర వాహనం న్యూ గోవింద్పురాకు చెందిన ధీరజ్ అనే వ్యక్తిదని తేలిందని స్పష్టం చేశారు. న్యూ గోవింద్పురాలో తనిఖీ చేయగా.. నిందితుడు అక్కడి నుంచి ఐదేళ్ల క్రితమే మకాం మార్చాడని తెలిసిందని... తర్వాత జగత్పురి ప్రాంతంలో ధీరజ్ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
అప్పుల కోసం అపహరణ
విచారణలో ధీరజ్ నిజం బయటపెట్టినట్లు డీసీపీ(తూర్పు) జస్మీత్ సింగ్ పేర్కొన్నారు. చిన్నారిని అపహరిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఉపేందర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ధీరజ్ ఇచ్చిన సమాచారంతో ఉపేందర్ను కృష్ణానగర్ ప్రాంతంలో బుధవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అప్పుల్లో చిక్కుకుపోవడం వల్లే తన సోదరుడి కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఉపేందర్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. పారిపోయిన మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి-అమెరికా అతలాకుతలం- 41 లక్షలు దాటిన కేసులు