కర్ణాటక మంగళూరు జిల్లా కొడికల్ పట్టణంలో అచ్చం అడవిలా.. పచ్చని చెట్లు నిండిన ఓ ఇల్లు ఆకట్టుకుంటోంది. 4.5 సెంట్ల భూమి ఉంటే.. 3.5 సెంట్ల స్థలంలో ఇల్లు.. మిగిలిన స్థలమంతా మొక్కలకే అంకితమిచ్చారు ప్రకృతి ప్రేమికుడు కృష్ణ గోవింద.
ఇంటికి హరిత కళ..
కేరళకు చెందిన గోవింద్.. పుట్టింది, పెరిగింది కర్ణాటక ఉడిపిలోనే. చాలా ఏళ్లపాటు గుజరాత్ సూరత్లో సొంత వ్యాపారం చేసుకుని ఎదిగారు. రెండేళ్ల క్రితమే స్వచ్ఛంద విరమణ తీసుకుని భార్యతో కలిసి కొడికల్లో స్థిరపడ్డారు. గోవింద్ ఎక్కడున్నా హరితమయమే. ఇప్పుడు ఈ కొత్త ఇంటి చుట్టూ దాదాపు 300 రకాల మొక్కలు నాటేసి ఇంటిని ప్రకృతిలో మమేకం చేశారు.
కుండీలు, పెయింట్ బక్కెట్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ బాటిళ్లు.. ఇలా ఏదీ వదల్లేదు. అన్నింట్లోనూ ఓ మొక్కకు జీవం పోశారు గోవింద్. పండ్లు, పూల మొక్కలే కాదు.. కూరగాయలు, ఔషధ గుణాలున్న మొక్కలెన్నో ఇంట్లో తారసపడతాయి. పైగా ఎన్నో సీతాకోక చిలుకలు, పక్షులకు ఈ ఇల్లే గూడు. వాటి కోసం ప్రత్యేక కుండీల్లో గింజలు, నీరు ఏర్పాటు చేశారు గోవింద్.