తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెరుపుదాడులపై మరోమారు దుమారం

పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ మెరుపుదాడులపై కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. పిట్రోడా వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులకు కాంగ్రెస్​ వంతపాడుతోందని ఆరోపించింది.

By

Published : Mar 22, 2019, 3:56 PM IST

Updated : Mar 22, 2019, 5:26 PM IST

వాయుదాడులపై రాజకీయం

వాయుదాడులపై రాజకీయం
ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్​ మెరుపుదాడులపై అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు మళ్లీ మొదలయ్యాయి. ఉగ్రవాద ఘటనలపై వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి తెరలేపారు కాంగ్రెస్​ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శ్యామ్​ పిట్రోడా.

"పాకిస్థాన్​ మన పొరుగుదేశం. నాకు తెలిసి పాక్​తోనే కాకుండా ప్రతిదేశంతోనూ ఆరోగ్యకరమైన చర్చలుండాలి. ముంబయి దాడి సమయంలో మేం ప్రతిఘటించాం. ఇప్పుడు విమానాలను పంపాం. కానీ అది సరైన చర్య కాదు. ప్రపంచంతో అలా వ్యవహరించకూడదు. ఓ 8 మంది వచ్చి మనపై దాడి చేస్తే.. వారి దేశం మొత్తం మీద పడిపోవటం సరికాదు. న్యూయార్క్​ టైమ్స్, ఇంకా కొన్ని వార్తాపత్రికల్లో చదివాను. మనం నిజంగా దాడులు చేశామా? 300 మందిని చంపామా? ఆ విషయం నాకు తెలియదు. కానీ ఓ పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కు ఉంది."
- శ్యామ్ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు

ప్రజలు క్షమించరు: మోదీ

పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్​కు కాంగ్రెస్ మద్దతు పలుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రజలు క్షమించరు అనే హ్యాష్​ట్యాగ్​తో వరుస ట్వీట్లు చేసి, కాంగ్రెస్​ నాయకులపై నిప్పులు చెరిగారు మోదీ.

"రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన సలహాదారు పాకిస్థాన్ జాతీయ దినోత్సవాలను కాంగ్రెస్ తరఫున ప్రారంభించారు. అదీ భారత సైన్యాన్ని అవమాన పరుస్తూ సాగడం విచారకరం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

"తీవ్రవాదంపై పోరుకు కాంగ్రెస్​ అయిష్టంగానే వ్యవహరిస్తుందని దేశం మొత్తానికి తెలుసు. ఆ విషయాన్ని కాంగ్రెస్ సామ్రాజ్యానికి నమ్మిన బంటు ఒప్పుకున్నారు.
ఇది నూతన భారతం. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలోనే వారికి సమాధానమిస్తాం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

అలవాటుగా మారింది

సమాజ్​వాదీ పార్టీ నేత రామ్​గోపాల్ యాదవ్​ వ్యాఖ్యలనూ తప్పుబట్టారు మోదీ.

"ఉగ్రవాదులకు క్షమాపణలు చెప్పటం, సైన్యాన్ని ప్రశ్నించటం విపక్షాలకు అలవాటుగా మారింది. కశ్మీర్​ను కాపాడుతున్న వారిపై రామ్​గోపాల్​ వంటి సీనియర్​ నేత అనుమానాలు వ్యక్తం చేయటం దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలు అమరుల కుటుంబాలను మరింతగా బాధిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"ప్రతిపక్షాలు మరోసారి సైన్యాన్ని అవమానించాయి. వారి వ్యాఖ్యలపై ప్రతి భారతీయుడు ప్రశ్నించాలని కోరుతున్నాను. వారికి చెప్పండి.. విపక్షాల కుయుక్తులను 130 కోట్ల మంది భారతీయులు క్షమించం, మరచిపోమని. సైన్యానికి భారత్​ అండగా నిలబడుతుంది."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

పాక్​కు మద్దతిస్తారా..?

పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అరుణ్​జైట్లీ ఖండించారు.

"ఆయన లెక్క ప్రకారం ఉగ్రవాదుల విషయంలో మేం చేసింది తప్పు. ప్రపంచంలో ఏ దేశమూ ఇలా చెప్పలేదు. ఇస్లామిక్ దేశాల సమాఖ్య మాట్లాడలేదు. పాకిస్థాన్​ మాత్రమే ఆక్షేపించింది. ఆ దేశం మాటలను సమర్థించే వారు దేశంలోని రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. అది మన దురదృష్టం. గురువు ఎలా ఉంటే శిష్యులు అలాగే తయారవుతారు. "
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

పౌరుడిగానే ప్రశ్నించా..

తన వ్యాఖ్యలను తప్పుబడుతూ భాజపా చేస్తున్న ఎదురుదాడిపై శ్యామ్ పిట్రోడా స్పందించారు. పార్టీ తరఫున ప్రశ్నించలేదని, నిజాలను తెలుసుకోవటం పౌరుడిగా హక్కు అని బదులిచ్చారు.

"నేను ఓ పౌరుడిగానే అడిగాను. ఏం జరిగిందో తెలుసుకునే హక్కు నాకుంది. ఇందులో వివాదం ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఓ పార్టీ తరఫున నేను మాట్లాడలేదు. పౌరుడిగానే నాకున్న హక్కుతోనే అడిగాను. "
- శ్యామ్​ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు

ఇదీ చూడండి:ఎన్నికల్లో ఓపెనింగ్​కు గౌతం గంభీర్​ సిద్ధం!

Last Updated : Mar 22, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details