అహంకారం, అనిశ్చితి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధానాంశాలుగా మోదీ 2.0 ప్రభుత్వ 100 రోజుల పాలన సాగిందని ధ్వజమెత్తింది కాంగ్రెస్. దేశ ఆర్థిక స్థితిగతులు, కశ్మీర్ పరిస్థితి, అసోం ఎన్ఆర్సీ, విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల చర్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. '100 డేస్ నో వికాస్' (అభివృద్ధి లేని 100 రోజులు) హ్యాష్ టాగ్తో భాజపాను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేసింది కాంగ్రెస్.
"భాజపా 2.0 వంద రోజుల పాలనను మూడు పదాల్లో వర్ణించవచ్చు. అవి దౌర్జన్యం, గందరగోళం, అరాచకం."
- కాంగ్రెస్ పార్టీ ట్వీట్
'అజ్ఞానంతో మాంద్యం'
మోదీ సర్కార్ అజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ స్థూల నిర్వహణ లోపాల వల్లే దేశ ప్రగతి రథం నెమ్మదించిందని విమర్శించింది కాంగ్రెస్.
"దేశంలోని 8 కీలక రంగాలు 2 శాతం కంటే తక్కువ వృద్ధిరేటు నమోదు చేస్తున్నాయి. అర్థిక వృద్ధి పతనమవుతోంది. అయినప్పటికీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు ఆర్థికమంత్రి నిరాకరిస్తున్నారు. భాజపా ఇలానే నిర్లక్ష్యంగా, మోసపూరిత మార్గాన్ని కొనసాగిస్తే దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లకతప్పదు."
- కాంగ్రెస్ పార్టీ ట్వీట్