పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వచ్చే వారం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్) రూపకల్పనకు అనుమతి ఇవ్వనుంది. ఒకసారి ఎన్పీఆర్ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్ఆర్సీ)ని రూపొందించనుంది.
ఎన్పీఆర్ ఎందుకు?
దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) తయారీకి రూ.3,941 కోట్లు కేటాయించాలని కేంద్ర హోంశాఖ కోరుతోంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం ఈ ప్రక్రియ లక్ష్యమని ఓ అధికారి చెప్పారు. ఎన్పీఆర్ను తాజా సమాచారంతో సవరించినట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ధ్రువీకరించిన తరువాతే ఎన్ఆర్సీపై నోటిఫికేషన్ ఇస్తారు.
ఏప్రిల్ 1న శ్రీకారం
ఆర్జీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అసోం మినహా మొత్తం దేశమంతటా జనాభా పట్టికను రూపొందిస్తారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదే చోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు.