యుద్ధాలకు స్వస్తి పలుకుతూ.. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మొదటి ప్రపంచయుద్ధం అనంతరం సరిగ్గా వందేళ్ల క్రితం.. 1920 జనవరి 10న 'లీగ్ ఆఫ్ నేషన్స్ (ఎల్ఎన్)' ఏర్పాటైంది. దీనినే నానాజాతి సమితి అని కూడా పిలుస్తారు. కొద్దిరోజులే పనిచేసిన ఎల్ఎన్.. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది. అయినప్పటికీ.. ప్రస్తుత ఐక్యరాజ్యసమితిలోని చాలా ప్రత్యేక సంస్థలకు అప్పట్లోనే మార్గనిర్దేశం చేసింది.
రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో నానాజాతి సమితి విఫలమైనందున.. భవిష్యత్ యుద్ధాలను నిరోధించేందుకు 1945 ఏప్రిల్ 25న 50 దేశాల ప్రతినిధులు శాన్ఫ్రాన్సిక్సోలో సమావేశమయ్యారు. అప్పుడే నానాజాతి సమితి వారసత్వ సంస్థగా ఐక్యరాజ్య సమితిని నెలకొల్పేందుకు అంగీకరించారు. 'ప్రపంచదేశాల మధ్య సహకారం' అనే ఎల్ఎన్ సిద్ధాంతంతోనే 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి ఏర్పాటైంది. 1946 ఏప్రిల్లో జెనీవాలో నానాజాతి సమితి సభ్యులు సమావేశమై లీగ్ ఆస్తులను ఐక్యరాజ్యసమితి బదిలీ చేయాలని నిర్ణయించారు.అప్పటినుంచి ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహకారం పెంపొందించే దిశగా లీగ్ ఆఫ్ నేషన్స్ స్థానంలో ఐక్యరాజ్యసమితి నేటికీ కార్యకలాపాలు సాగిస్తోంది.
బహుపాక్షిక దౌత్యనీతి వైపు అడుగులు
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1919 జూన్లో జరిగిన వర్సేల్స్ సంధిలో భాగంగా భారతదేశం నానాజాతి వ్యవస్థాపక సభ్యత్వం పొందింది. తద్వారా నానాజాతి సమితిలో ప్రాతినిధ్యం వహిస్తున్న స్వీయ పాలన లేని ఏకైక దేశంగా పేరుగాంచింది. భారత సభ్యత్వాన్ని అసాధారణ విషయాల్లోకెల్లా అసాధారణమైనదిగా అభివర్ణించారు చరిత్రాకారులు. అయితే భారత్ స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలతో సమానంగా చట్టపరమైన హోదాను అనుభవించిందని తెలిపారు.
నానాజాతి సమితి ద్వారా భారత్ మొట్టమొదటి సారిగా రెండు అంశాల్లో బహుపాక్షిక దౌత్యనీతి వైపు అడుగులేసింది. అందులో భాగంగా శాంతి బాటలో నడుస్తూ.. యుద్ధ నివారణకు కట్టుబడి ఉండటం మొదటిది. 1927లో పారిస్లో జరిగిన కెల్లాగ్-బ్రియాండ్ ఒప్పందం (శాంతి ఒప్పందం)పై సంతకం చేసిన లీగ్లోని 15 సభ్యదేశాల్లో భారత్ కూడా ఒకటి. యుద్ధ నివారణ కోసమే పుట్టుకొచ్చిన ఈ ఒప్పందాన్ని కార్యరూపం దాల్చడంలో కీలకపాత్ర పోషించిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కెల్లాగ్కు 1929లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
రెండోది, దేశీయ సామాజిక-ఆర్థిక అభివృద్ధిని కొనసాగించడానికి కొత్తగా సృష్టించిన ఆధునిక బహుళపాక్షిక దౌత్యనీతిలో భారత్ ప్రమేయం. 1922 నుంచి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)లో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉంది. భారత్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక కార్మికుల పని గంటలను తగ్గించడం సహా భారత నావికులను ప్రత్యేకంగా పరిగణించడం వంటి అంశాలను ఈ సంస్థలో ప్రస్తావించారు.