తెలంగాణ

telangana

ETV Bharat / bharat

28రోజుల తర్వాత ఒడ్డుకు చేరుకున్న సముద్ర వీరుడు! - సముద్రంలో 28 రోజులు

నడి సముద్రంలో చిక్కుకుని..రెండు తుపాన్లను ఎదుర్కొని 28 రోజుల తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు అండమాన్​కు చెందిన ఓ వ్యక్తి. దారి తప్పిన పడవలో నరక యాతన అనుభవించి.. స్నేహితుడి మరణంతో కుంగిపోయి.. ఎట్టకేలకు ఒడిశా తీరం వద్ద నేలపై అడుగుపెట్టాడు.

28రోజుల తర్వాత ఒడ్డుకు చేరుకున్న సముద్ర వీరుడు!

By

Published : Oct 27, 2019, 7:37 AM IST


అండమాన్‌కు చెందిన ఓ వ్యక్తి నడి సముద్రంలో చిక్కుకొని 28 రోజుల తర్వాత ఒడిశా తీరానికి చేరుకున్నాడు. అండమాన్‌ నుంచి తనతోపాటు వచ్చిన స్నేహితుడు మధ్యలోనే చనిపోగా.. ఒడిశాలోని ఖిరిసాహి అనే తీర గ్రామానికి అతడు ఉన్న పడవ శుక్రవారం కొట్టుకొచ్చింది. అండమాన్‌ నుంచి ఒడిశా తీరం 750 నాటికల్‌ మైళ్లు (1300 కిలోమీటర్లు) కావడం గమనార్హం.

అలా మొదలైన ప్రయాణం..

అమృత్‌ కుజుర్‌ (49) తన స్నేహితుడు దివ్యరాజన్‌తో కలిసి సెప్టెంబరు 28న సముద్రంలోకి బయలుదేరాడు. వివిధ సరకులు, తాగునీటిని సముద్రంలో వచ్చిపోయే నౌకలకు విక్రయించే వ్యాపారం వారిది. ఇలా రూ.5 లక్షల విలువైన సరకులతో ఓ మర పడవలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని షాహిద్‌ ద్వీప్‌ నుంచి బయలుదేరాడు. ఈ లోపు తుపాను వచ్చి తమ మరపడవ.. గతి తప్పిపోయింది. ఇంధనం అయిపోవడమే కాక, పడవ పైభాగం దెబ్బతిన్నది. సాయం కోసం వారి వద్ద ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా పాడైంది. దీంతో పడవలో బరువు తగ్గించుకోవాలని వారు తీసుకొచ్చిన సరకులన్నింటినీ సముద్రంలో పారేశారు. సాయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అటుగా వెళ్లే ఏ నౌకా వారిని గుర్తించలేదు. చివరికి మయన్మార్​కు చెందిన ఓ నౌకాదళ ఓడ వారి వద్దకు వచ్చి 260 లీటర్ల డీజిల్‌, కంపాస్‌ ఇచ్చి సాయం చేసింది.
ఇంటి ముఖం పడుతున్న సమయంలో బంగాళాఖాతంలో వారు మరో తుపాను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాకాసి గాలులకు వారి మర పడవ మరింత దెబ్బతిన్నది. భారీ అలలకు
లోపలకునీళ్లు చేరాయి. ఇంజిన్‌ ఆన్‌లోనే ఉంచడం వల్ల అదృష్టవశాత్తు పడవ బోల్తా పడలేదు.

స్నేహితుడి మరణం..

‘'మాకు తిండి, నీరు లేక నీరసించిపోయాం. నా స్నేహితుడు దివ్యరాజన్‌ కొద్ది రోజులకు మరణించాడు. నేను కూడా వర్షపు నీటిని తువ్వాలుతో ఒడిసి పట్టి తాగాను. స్నేహితుడి మృతదేహం రెండు రోజులు బోటులోనే ఉంచినా, అది కుళ్లిపోతుందని సముద్రంలో పడేయాల్సి వచ్చింది. నేను కూడా చనిపోతానని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల బతికాను' అని కుజుర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

అమృత్​ను విచారించిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అండమాన్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించామని తెలిపారు.

ఇదీ చూడండి:ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీస్​.

ABOUT THE AUTHOR

...view details