నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కొంత భూమిని ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయనకు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. అసహనం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో తనను సోదరిగా భావించాలంటూ అమర్త్యసేన్కు ఆమె శుక్రవారం లేఖ రాశారు.
శాంతినికేతన్లోని సేన్ నివాసంలో కొంత భాగం.. విశ్వభారతికి చెందిందిగా కొందరు ఆరోపించడాన్ని మమత కొట్టిపారేశారు. భాజపా, ఆర్ఎస్ఎస్లపై మమత పరోక్షంగా విమర్శలు చేశారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే సేన్ను వారు లక్ష్యంగా చేసుకొని వివాదాలు సృష్టిస్తున్నట్లు విమర్శించారు.