తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 6:06 AM IST

Updated : Nov 12, 2019, 10:47 AM IST

ETV Bharat / bharat

'మహా' ప్రతిష్టంభన: సేనకు చిక్కని పీఠం-ఎన్​సీపీకి ఆహ్వానం!

మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. శివసేనకు మద్దతిచ్చే అంశమై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా గవర్నర్​ భగత్​సింగ్ కోషియారీ విధించిన గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సేన విఫలమైంది. ప్రభుత్వ స్థాపనకు సేన మరింత సమయం కోరినప్పటికీ గవర్నర్ అందుకు తిరస్కరించి.. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్​సీపీకి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎన్​సీపీ మిత్రపక్షం కాంగ్రెస్ కోర్​ కమిటీ నేడు సమావేశంకానుంది.

'మహా' ప్రతిష్టంభన: సేన విఫలం-ఎన్సీపీకి సాధ్యమయ్యేనా!

సేనకు చిక్కని పీఠం-ఎన్​సీపీకి ఆహ్వానం!

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే అంశంపై కాంగ్రెస్​ నుంచి అస్పష్ట వైఖరి ఎదురవడం వల్ల శివసేనకు చుక్కెదురైంది. దీని వల్ల గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీ ఇచ్చిన గడువులోగా అధికారం చేజిక్కించుకోవడంలో సేన విఫలమైంది. ప్రభుత్వ స్థాపనకు శివసేన 48 గంటల సమయం కోరగా అందుకు గవర్నర్​ తిరస్కరించారు. అనంతరం ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్​సీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమిచ్చారు.

తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను (105స్థానాలు) గవర్నర్‌ ఆహ్వానించారు. 50-50 ఫార్ములాపై మిత్రపక్షం శివసేనతో విభేదాలు ఎదురవడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసింది కాషాయ దళం. అనంతరం రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన (56సీట్లు)ను గవర్నర్‌ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతిని తెలియజేయాలని సూచించారు. శివసేన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవ్వడం వల్ల ఎన్​సీపీని అహ్వానించారు. నేటి రాత్రి 8.30 గంటల వరకు గడువు విధించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మిత్రపక్షం కాంగ్రెస్​(44సీట్లు) మద్దతున్నప్పటికీ.. మెజారిటీ సరిపోదు. శివసేన సహకారం ఆ పార్టీకి తప్పనిసరి. మరి ఇప్పుడు ఎన్సీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సేనకు హస్తం షాక్..

సోమవారం రాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్​ గడువు ముగింపునకు కొంత సమయం ముందు.. కాంగ్రెస్​-ఎన్​సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వార్తాలొచ్చాయి. శివసేనకు చెందిన సామ్నా పత్రిక ఆన్​లైన్​ ఎడిషన్​ కూడా దీన్ని ధ్రువీకరించింది. అయితే సేనకు మద్దతిచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకలేదని.. మరిన్ని చర్చలు అవసరమని కాంగ్రెస్​ ప్రకటించింది. దీని వల్ల శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

నేడు కాంగ్రెస్​ సమావేశం...

మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కోర్​కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. ఎన్​సీపీకి మద్దతిచ్చే అంశం సహా.. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు సీనియర్​ నేతలు. మహారాష్ట్ర రాజకీయాలపై సోమవారం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ రెండు సార్లు సమావేశమైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మరో దఫా సమావేశంలో కాంగ్రెస్​ వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతలతో భేటీ: ఎన్సీపీ

మరోసారి.. శివసేనకు మద్దతిచ్చే అంశమై నేడు కాంగ్రెస్​ నేతలతో భేటీ అవుతామని ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ వెల్లడించారు.

భాజపా పరిశీలన

మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భాజపా నేత ముంగంటీవార్​ తెలిపారు.

ప్రతినిమిషం ఉత్కంఠగా

అంతకుముందు శివసేనకు చెందిన కేంద్రమంత్రి అరవింద్ సావంత్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్​సిపీ అధినేత శరద్​ పవార్​తో ఉద్ధవ్​ ఠాక్రేతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనూ ఫోన్లో సంభాషించారు ఉద్ధవ్. అయితే ఆ సమయంలో ఆమె నుంచి ఏ హామి లభించలేదని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్​కు తరలించింది కాంగ్రెస్ అధిష్ఠానం. వారికి అక్కడి రిసార్టులో వసతి కల్పించింది.

.

ఇదీ చూడండి: 'చట్టసభల్లో రిజర్వేషన్లతో మహిళా రాజకీయ సాధికారత'

Last Updated : Nov 12, 2019, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details