తెలంగాణ

telangana

శివసేన కోర్టులోనే 'మహా' బంతి

By

Published : Nov 11, 2019, 4:05 AM IST

Updated : Nov 11, 2019, 7:55 AM IST

సంఖ్యా బలంలేని భాజపా.. ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించిన నేపథ్యంలో 'మహా' బంతి శివసేన కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎన్​సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అదే సాకారమైతే శివసేన సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. అయితే సేనకు బద్దశత్రువులైన ఎన్​సీపీ, కాంగ్రస్​లు మద్దతిస్తాయా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

శివసేన కోర్టులోనే 'మహా' బంతి

మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని భాజపా తేల్చిచెప్పిన నేపథ్యంలో 'మహా' బంతి ఇప్పుడు శివసేన కోర్టులో ఉంది.

గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని శివసేనను ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం 7.30లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గడువు విధించారు. ఈ మేరకు రాజ్​భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

వ్యూహాలకు పదును

సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో శివసేన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత ఉద్ధవ్​ ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఎన్​సీపీ, కాంగ్రెస్ మద్దతు

శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఎన్​సీపీ, కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో శరద్​పవార్, సోనియాలతో మంతనాలు చేసేందుకు శివసేన నేత సంజయ్​ రౌత్​ రంగంలోకి దిగారు. ఇదే పనిపై హుటాహుటిన దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్, ఎన్​సీపీ నేతలతో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరనున్నారు.

భాజపాతో తెగదెంపులు చేసుకోవాల్సిందే..

బలపరీక్షలో మద్దతు తెలపాలంటే.. ఎన్డీఏ కూటమి నుంచిశివసేన పూర్తిగా బయటకు రావాలని ఎన్​సీపీ తేల్చిచెప్పింది. అలాగే కేంద్రప్రభుత్వంలోని అన్ని పదవులకూ సేన నాయకులు రాజీనామా చేయాలని పేర్కొంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించిన తరువాతే తమ వైఖరి ఏంటనేది స్పష్టం చేస్తామని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ స్పష్టం చేశారు.

అయితే ఓకే

ఎన్​సీపీ తాజా ప్రతిపాదనకు శివసేన కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని కేంద్రమంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే ప్రకటించారు.

రాష్ట్రపతి పాలన సహించం.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు తాము సిద్ధంగా లేమని కాంగ్రెస్ తెలిపింది. అయితే ప్రతిపక్షంలో ఉందామని రాజస్థాన్​లోని జైపుర్​లో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మూడూ కలిస్తే

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 145 సభ్యుల బలం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. భాజపా 105, శివసేన 56, ఎన్​సీపీ 54, కాంగ్రెస్​కు 44 సీట్లు ఉన్నాయి. అంటే శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ కలిస్తే సులభంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చు.

ఇదీ చూడండి: మాజీ సీఈసీ టీ.ఎన్. శేషన్​ కన్నుమూత

Last Updated : Nov 11, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details