తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 4:45 PM IST

ETV Bharat / bharat

టపాసులపై పలు రాష్ట్రాల నిషేధం

దీపావళి వేళ బాణసంచాపై దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. ఈ జాబితాలో చేరుతున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కర్ణాటకలో బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు సీఎం యడియూరప్ప. మరోవైపు నిషేధం విధించేందుకు నిరాకరించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. టపాసులు కాల్చేందుకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది.

Firecrackers ban
బాణసంచాపై పలు రాష్ట్రాల బ్యాన్‌

దీపావళి వేళ బాణసంచాపై నిషేధం విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దిల్లీ సహా పలు రాష్ట్రాలు నిషేధం ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో కర్ణాటక చేరింది. కరోనా విజృంభణ వేళ రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం మరింతగా పెరిగి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

వివిధ రాష్ట్రాల్లో కారణాలివే..

  • దిల్లీలో వాయు కాలుష్యం పెరగడం, కరోనా విలయతాండవం చేస్తున్న వేళ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ గురువారం రాత్రి ప్రకటించారు. నవంబర్‌ 7 నుంచి 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసిన దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.. దిల్లీ మంత్రి గోపాల్‌రాయ్‌.
  • వాయు కాలుష్యం, కరోనా వైరస్‌, చలికాలంలో గాలి నాణ్యతపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఇప్పటికే ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం ప్రకటించాయి. హరియాణా ప్రభుత్వం కూడా పాక్షికంగా నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న బాణసంచా విక్రయాలను చట్టవిరుద్ధంగా పేర్కొంది.
  • టపాసులు కాల్చేందుకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. వీటిపై నిషేధం మాత్రం విధించలేదు. వాయు కాలుష్యంతో కరోనా బారిన పడినవారి ఆరోగ్యం మరింత క్లిష్టమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఇంట్లోనే దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవాలని సూచించింది.
  • కాళీ పూజ సందర్భంగా బాణసంచా అమ్మకాలను కోల్‌కతా హైకోర్టు ఇప్పటికే నిషేధించింది.

తమిళనాడు సీఎం లేఖ

బాణసంచా కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాజస్థాన్‌, ఒడిశా ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో బాణసంచా ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా మరో 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధం కారణంగా ఉత్పత్తిదారులు, విక్రయదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దేశంలో బాణసంచా ఉపయోగంలో 90శాతం ఉత్పత్తి తమిళనాడులో జరుగుతోందని తెలిపారు. నిబంధనల ప్రకారమే బాణసంచా తయారు చేస్తున్నారని, దీనివల్ల కాలుష్య సమస్య ఏర్పడదని పేర్కొన్నారు. బాణసంచా కాల్చేందుకు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఈసారి దీపావళి బాంబులు లేనట్టే

ABOUT THE AUTHOR

...view details