తెలంగాణ

telangana

కమల్​నాథ్​ నిలిచేనా- కమలనాథులే గెలిచేనా?

By

Published : Mar 15, 2020, 6:36 PM IST

Updated : Mar 15, 2020, 11:43 PM IST

మధ్యప్రదేశ్​ రాజకీయ సంక్షోభానికి సోమవారంతో తెరపడనుంది. బడ్జెట్​ సమావేశాల తొలి రోజునే విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది కమల్​నాథ్​ సర్కార్. అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపా తమ వ్యూహాలకు పదునుపెడుతూ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి గెలుపెవరిది?

Madhya Pradesh
కమలనాథ్​ నిలిచేనా- కమలనాథులే గెలిచేనా?

కమల్​నాథ్​ నిలిచేనా- కమలనాథులే గెలిచేనా?

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. సోమవారం జరగబోయే బలపరీక్షతో ఉత్కంఠకు తెరపడనుంది. అధికార పీఠాన్ని కాంగ్రెస్​ నిలుపుకోనుందా?.. విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోలేక అధికారాన్ని భాజపాకు చేజార్చుకుంటుందా అనేది రేపటితో తేలిపోతుంది.

అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 16 నుంచి ఏప్రిల్​ 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు తన​ ప్రసంగం పూర్తి అయిన వెంటనే విశ్వాస పరీక్ష ఉంటుందని గవర్నర్​ లాల్జీ టాండన్​ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేశారు.

రాజీనామాల ఆమోదంతో..

22 మంది కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను శనివారం ఆమోదించారు స్పీకర్​ ప్రజాపతి. తాజా నిర్ణయంతో.. మధ్యప్రదేశ్​ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 222కు పడిపోయింది. కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత ప్రభుత్వానికి.. కాంగ్రెస్​ 108, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిపి 114 మంది బలం ఉంది.

విప్​లు​ జారీ..

అధికార కాంగ్రెస్​ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్​ జారీ చేసింది. సోమవారం నుంచి ఏప్రిల్​ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్​ సెషన్​లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. భాజపా కూడా తమ ఎమ్మెల్యేలకు విప్​ జారీ చేసింది.

షాకు లేఖ..

సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా బెంగళూరులో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరయ్యేలా భరోసా కల్పించాలని కోరుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు శనివారం లేఖ రాశారు ముఖ్యమంత్రి కమల్​నాథ్​. వారంతా ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు.

సింధియాతో సంక్షోభం..

మధ్యప్రదేశ్​లో కీలక నేత జోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేయడం, ఆయన మద్దతుదారులైన 22 మంది​ ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవటం వల్ల సంక్షోభం నెలకొంది. వీరంతా భాజపాలో చేరతారని అందరు అనుకున్నప్పటికీ.. సింధియా ఒక్కరే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది.

బెంగళూరులోని ఓ రిసార్ట్​లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్​ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరిగి పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఆరుగురి రాజీనామాలను స్పీకర్​ ఆమోదించగా.. మిగతా 16 మంది రాజీనామాలపై ఉత్కంఠ నెలకొంది.

16 మంది రాజీనామాలు ఆమోదిస్తే..

22 మంది రెబల్​ ఎమ్మెల్యేల్లో మిగతా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కు పడిపోతుంది. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 104కు చేరుతుంది. కాంగ్రెస్​ బలం 92కు చేరుకోవటం వల్ల మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిపోతుంది అధికార కూటమి. దీంతో భాజపాకు ఉన్న 107 స్థానాలతో అధికారం పీఠం దక్కించుకుంటుంది.

అయితే.. తమ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్​ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. విశ్వాస పరీక్షలో నెగ్గితీరుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్న మాటల్లో నిజం ఎంతుందనేది రేపటితో తేలిపోనుంది.

బలపరీక్షపై స్పీకర్​ ఏమన్నారంటే?

వివిధ మాధ్యమాల ద్వారా రాజీనామాలు పంపించిన ఎమ్మెల్యేల కోసం ఎదురుచూస్తున్నానని, వారు ఎందుకు రాజీనామాలు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు అసెంబ్లీ స్పీకర్​ ప్రజాపతి. అసెంబ్లీలోని సభ్యులకు ఏమి అయిందనే విషయంపై ఆందోళన చెందుతున్నానన్నారు. ప్రస్తుత పరిస్థితులు ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు​.

సోమవారం బలపరీక్ష జరుగనుందా అనే అంశంపై అడిగిన ప్రశ్నకు దాటవేసే సమాధానమిచ్చారు స్పీకర్​. దాని గురించి రేపే తెలుస్తుందని.. తాను తీసుకోబోయే నిర్ణయం ముందుగానే వెల్లడించాల్సిన అవసరం లేదన్నారు.

ఇదీ చూడండి: 'ధరలు తగ్గితే.. మన 'మేధావి' సుంకాలు పెంచారు'

Last Updated : Mar 15, 2020, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details