తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉప ఎన్నికలకు రంగం సిద్ధం- ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలకంటే? - Marwahi Assembly bypoll in Chhattisgarh

దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్​ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్​ జరగనుంది.

MP bypolls: Voting on Tuesday, 33,000 cops on security duty
ఉప ఎన్నికలకు రంగం సిద్ధం- ఏ రాష్ట్రంలో ఎలాగంటే?

By

Published : Nov 2, 2020, 8:05 PM IST

మధ్యప్రదేశ్​లో 28 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పోలింగ్​లో చివరి గంటను ప్రత్యేకంగా కరోనా రోగులకు కేటాయించారు అధికారులు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల నడుమ పోలింగ్​ చేపట్టనుంది ఎన్నికల సంఘం.

రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిసారిగా రికార్డు స్థాయిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో 12 మంత్రులు సహా.. మొత్తం 355 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 19 జిల్లాల్లో జరగనున్న ఈ పోలింగ్​ కోసం సుమారు 33వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్టు తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి అరుణ్​ తోమర్​. 250 మంది ఫ్లయింగ్​ స్క్వాడ్​, 173 మంది స్టాటిక్​ నిఘా బృందాలు, 293 చెక్​పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

మొత్తం 63.67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు తోమర్​. ఇందుకోసం 9,361 పోలింగ్​ బూత్​లను ఏర్పాటు చేశామని.. వాటిలో 3,038 కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు ఆయన తెలిపారు.

మరికొన్ని రాష్ట్రాల్లోనూ..

  • ఉత్తర్​ప్రదేశ్​లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్​ జరగనుండగా.. మొత్తం 88 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఏడు స్థానాల్లో గతంలో భాజపా-6, సమాజ్​వాద్​ పార్టీ-1 సీట్లు దక్కించుకున్నాయి. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి అజయ్​ కుమార్​ శుక్లా చెప్పారు. అయితే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై యోగి సర్కార్​పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హాథ్రస్​, బల్రామ్​పుర్​ హత్యాచార ఘటనల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎంతవరకు సజావుగా సాగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
  • కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ఈ రెండు స్థానాలకు గానూ.. ఏకంగా 31 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,008 పోలింగ్​ కేంద్రాల్లో.. మొత్తం 6.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే.. అశోక్​ గస్తీ మరణానంతరం ఆ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి డిసెంబర్​ 1న ఉప ఎన్నిక జరగనుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
  • ఛత్తీస్​గఢ్​లోని మర్వాహీ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఒక్క స్థానం కోసం 8 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 286 పోలింగ్​ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్​ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 1,90,907 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది.

ఇదీ చదవండి:ఎన్నికల ప్రచారానికి సినిమా హంగులు

ABOUT THE AUTHOR

...view details