కర్ణాటక బెంగళూరులో భారీ భయానక శబ్దం వినిపించింది. నగరంలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.అయితే ఈ అనుమానాస్పద శబ్దం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
విమానాశ్రయం నుంచి..
బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ శబ్దం వచ్చినట్లుగా పలువురు చెబుతున్నారు. కల్యాణ్ నగర్, ఎంజీ రోడ్, మారతహళ్లి, వైట్ఫీల్డ్, సర్జాపుర్, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెబ్బగోడి ప్రాంతాల్లో శబ్దం వినిపించినట్లు తెలుస్తోంది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
"ఉన్నట్టుండి భారీ శబ్దం వినిపించింది. ఇలాంటి శబ్దం ఇది వరకూ ఎప్పుడూ వినలేదు. మొదట బాంబు పేలిందని అనుకున్నాం." అని సిలికాన్ సిటీ వాసి ఒకరు చెప్పారు.
"మీడియా ద్వారా ఈ సమాచారం మాకు చేరింది. దీని గురించి అత్యవసర నంబరు 100కు ఎలాంటి కాల్స్ రాలేదు. వైమానిక దళ కంట్రోల్ రూమ్ను కూడా సంప్రదించి విచారించాం. విమానం లేదా ఏదైనా సూపర్సోనిక్ శబ్దమా అని ఆరా తీశాం. వారి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం."
- భాస్కర్రావ్, పోలీస్ కమిషనర్
భూకంపానికి సంబంధించిన శబ్దమని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే సిస్మోమీటర్లు ఎలాంటి ప్రకంపనలను నమోదు చేయలేదని రాష్ట్ర విపత్తు పరిశీలన కేంద్రం వెల్లడించింది.