విశాఖలో లీకైన స్టైరిన్ రసాయనం కారణంగా దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని దిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ఇదే సమయంలో ఈ స్టైరిన్ రసాయనం పూర్తిస్థాయిలో ప్రాణాంతకం కూడా కాదని పేర్కొంది. దీనికి సంబంధించి పెద్దగా చికిత్సా పద్ధతులు గానీ ప్రత్యేకమైన ఔషధాలు కూడా లేవన్న ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియా.. వారికి కేవలం వైద్యపరమైన మద్దతు సరిపోతుందని వివరించారు.
ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది నయమై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. భోపాల్ తరహాలో దీర్ఘకాలిక సమస్యలేవీ ఎదురుకావని.. ఈ రసాయనం ఎక్కువ సమయం గాలిలో ఉండబోదని చెప్పారు. శరీరం నుంచి త్వరగానే బయటకు పోతుందని తెలిపారు. గ్యాస్ లీకైన ప్రాంతానికి సమీపంలో ఉన్న వారికి మాత్రం అధిక స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని.. ఇంటింటి సర్వే ద్వారా వారిని గుర్తించి చికిత్స అందించాల్సి ఉంటుందని అన్నారు.