తెలంగాణ

telangana

'మరోసారి మిడతల దండయాత్ర.. జర జాగ్రత్త'

By

Published : Jul 5, 2020, 10:45 PM IST

పచ్చని పొలాలపై దాడి చేసి.. పండించిన పంటను ఇట్టే పీక్కుతినే మిడతలు మరోసారి భారత్​కు రానున్నాయని ఎఫ్​ఏఓ తెలిపింది. మరో నాలుగు వారాల్లో ఈ కీటకాలు దేశంపై దండెత్తనున్నాయని హెచ్చరించిన ఎఫ్ఏఓ.. రాజస్థాన్​ ఎక్కువగా ప్రభావితం కానుందని పేర్కొంది.

Locust menace: FAO asks India to be on high alert for next 4 weeks
దేశానికి పొంచి ఉన్న మిడతల ముప్పు

రాబోయే నాలుగు వారాల్లో మిడతల దాడి పట్ల భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్​ఏఓ) హెచ్చరించింది. భారత్- పాకిస్థాన్ సరిహద్దుకు వలస వెళ్లిన మిడతలు.. రుతు పవనాల ప్రారంభంతో రాజస్థాన్‌కు తిరిగి వస్తాయని ఎఫ్​ఏఓ తాజా నివేదికలో పేర్కొంది. రాజస్థాన్‌కు వచ్చిన అనంతరం అప్పటికే ఇరాన్, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇతర మిడతలతో కలిసి సమూహాలుగా దాడి చేయనున్నట్లు వివరించింది.

ఇతర దేశాల్లోనూ..

మిడతల దాడి వల్ల రాజస్థాన్ ఎక్కువగా ప్రభావితం కానుంది. రాజస్థాన్‌ సహా మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు మిడతల దాడి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఎఫ్​ఏఓ స్పష్టం చేసింది. భారత్‌తో పాటు పాక్​, సూడాన్, ఇథియోఫియా, సోమాలియా వంటి దేశాలు ఈ రాకాసి పురుగుల వల్ల భారీ పంట నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

కేంద్రం అప్రమత్తం..

ఎఫ్​ఏఓ నివేదికతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. మిడతల నివారణ చర్యలను ముమ్మరం చేసింది. బెల్‌ హెలీకాప్టర్లు, డ్రోన్​ల సాయంతో సరిహద్దుల్లో పెద్దఎత్తున రసాయనాలను పిచికారీ చేస్తోంది. ఇప్పటి వరకూ లక్షా 35 వేల 207 హెక్టార్ల విస్తీర్ణంలో రసాయనాలు పిచికారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. మిడతలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details