కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంత మంది ఇంట్లో ఖాళీగా గడుపుతుంటే.. మరికొందరు మాత్రం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కర్ణాటక ధార్వాడ్ నగరంలోని నాలుగు ప్రాంతాల ప్రజలు కూడా చెరువు రూపంలో లాక్డౌన్ను సద్వినియోగం చేసుకున్నారు. అదెలాగో చూద్దాం..
ధార్వాడ్ నగరంలోని బసవేశ్వర బదావనే, శాకంబరి, గురుదేవ, నందిని లేఅవుట్లో నివాసముంటున్న ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక సరస్సును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి 3 లక్షల రూపాయలను సిద్ధం చేసి సరస్సును తవ్వేశారు.
అధికారులు స్పందించని కారణంగా
ఈ సరస్సును తవ్వించాలని ప్రభుత్వాధికారులను ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేనందున.. చివరకు తమ సొంత ఖర్చుతోనే తవ్వేశారు ధార్వాడ్ ప్రజలు.