'పౌర' నిరసనలతో దేశరాజధాని దిల్లీ అట్టుడుకుతోంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. తొలుత ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ విధించి నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. కానీ ఆందోళనకారులు జంతర్మంతర్ వద్దకు చేరుకుని నిరసనలు తెలిపారు. జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీకి వ్యతిరేకంగా జాతీయ పతాకాలతో నినాదాలు చేశారు. ఈ తరుణంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతియుత నిరసనలు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు.
దిల్లీలో అతి తక్కువ ఉష్ణోగ్రత(7 డిగ్రీలు) నమోదైనప్పటికీ.. నిరసనకారులు చలిని లెక్కచేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. నిరసనను అణచివేయడానికి కొంతమంది రాజకీయనేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నేతల అరెస్టు
అంతకుముందు ఎర్రకోట, మండీ హౌజ్ ప్రాంతాల వైపు దూసుకెళ్లిన నిరసనకారులను పోలీసులు అడ్డగించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిరసనలకు అనుమతులు లేదంటూ.. వారిని పోలీసులు నిలువరించారు. దీనితో అక్కడకు చేరుకున్న వామపక్ష నేతలు డి రాజా, సీతారాం ఏచూరీ, నిలోత్పల్ బసు, బృందా కారత్, కాంగ్రెస్ నేతలు అజయ్ ముకేన్, సందీప్ దీక్షిత్.. సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, ఉమర్ ఖలీద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఎర్రకోట వద్ద నిరసనలు చేపట్టిన వందలాది మంది విద్యార్థులను కూడా నిర్బంధించారు.
పోలీసుల చేయూత
పలువురు నిరసనకారులు పోలీసులకు గులాబీలు అందజేస్తూ శాంతి సందేశం ఇచ్చారు. పోలీసులు హింసాత్మకంగా ప్రవర్తించినా... శాంతియుతంగానే నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు సురాజ్మల్ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్న నిరసనకారులకు పోలీసులు పండ్లు అందించారు.
నిరసనల్లో పాల్గొన్న ముస్లిం విద్యార్థులు జామియా ఇస్లామియా యూనివర్సిటీ గేట్ వద్ద నమాజు చేశారు. ముస్లింలు నమాజ్ చేస్తున్న సమయంలో వారికి ఇతర విద్యార్థులు మద్దతుగా నిలిచారు. పోలీసులు వారి వద్దకు చేరుకోకుండా చుట్టూ మానవహారం ఏర్పాటు చేశారు.
మెట్రో నిలిపివేత...