లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుందని కేంద్రమంత్రి, భాజపా నేత సదానందగౌడ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం (మే 24) ఉదయం వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎద్దేవా చేశారు.
"కుమారస్వామి రేపు సాయంత్రం వరకు మాత్రమే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ రోజు రాత్రి అతను సరిగా నిద్రపోలేరు కనుక రేపు లేదా ఆ మరుసటి రోజు మాత్రమే ఆయన పదవిలో ఉంటారు. కచ్చితంగా శుక్రవారం ఆయన పదవి నుంచి దిగిపోతారు."
-సదానందగౌడ, కేంద్రమంత్రి, భాజపా నేత
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ తెలిపారు. 28 లోక్సభ స్థానాల్లో భాజపా 21 నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ కూటమికి ప్రతికూల ఫలితం వస్తుందని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి. ఇదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. 'ఆపరేషన్ కమల్' పేరుతో తమలోని అసంతృప్త నేతలను భాజపా ఆకర్షిస్తోందని కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ఆందోళన చెందుతోంది.