తెలంగాణ

telangana

కర్ణాటకీయం: నేడే బలపరీక్ష-సర్వత్రా ఉత్కంఠ

By

Published : Jul 22, 2019, 6:23 AM IST

Updated : Jul 22, 2019, 10:53 AM IST

కర్ణాటక రాజకీయాలు ఆఖరి అంకానికి చేరాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్ కేఆర్ రమేశ్​కుమార్ ప్రకటించడం కారణంగా ప్రభుత్వ మనుగడపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా శాసనసభా పక్ష సమావేశాలను నిర్వహించాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి.

కర్ణాటకీయం: నేడే బలపరీక్ష-సర్వత్రా ఉత్కంఠ

కర్ణాటకీయం: నేడే బలపరీక్ష-సర్వత్రా ఉత్కంఠ

అధికార కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉపసంహరణతో కర్ణాటక ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమైంది. విశ్వాస పరీక్ష శుక్రవారమే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ చర్చలో ఎక్కువమంది సభ్యులు పాల్గొనాల్సి ఉన్న కారణంగా సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ కేఆర్ రమేశ్​కుమార్. రెండు రోజుల విరామం అనంతరం నేడు కర్ణాటక శాసనసభ సమావేశం కానుంది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సభలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై కాంగ్రెస్​, జేడీఎస్​, భాజపాలు పోటాపోటీగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. బెంగళూరు యశ్వంతపురలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు​ కేసీ వేణుగోపాల్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నేతృత్వంలో అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

విప్ అంశం​పై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత వచ్చే వరకు.. బలపరీక్ష జరపకుండా చూడాలని అధికార కూటమి యోచిస్తోంది.

తెరపైకి సిద్ధరామయ్య సీఎం అభ్యర్థిత్వం

రాజీనామా చేసిన అసమ్మతి ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకు అనుకూలురు. ఈ కారణంగా ప్రభుత్వాన్ని ఎలాగైనా రక్షించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆయనను కోరారని సమాచారం. సిద్ధరామయ్య లేదా కాంగ్రెస్​కు చెందిన మరో నేత సీఎం అయ్యే పక్షంలో బయటినుంచి మద్దతిస్తామని జేడీఎస్ హామీ ఇచ్చిందని డీకే శివకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబయి క్యాంప్​లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వం వైదొలిగాకే బెంగళూరుకు వెళ్తామని ప్రకటన విడుదల చేశారు.

సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి జేడీఎస్ అంగీకారం అనేది కేవలం వదంతేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావు వెల్లడించారు. రాజీనామా చేసిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి 30 కోట్లు ఇచ్చేందుకు బేరం కుదిరిందని ఆరోపించారు. బలపరీక్షలో నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.

జేడీఎస్​ శాసనసభా పక్ష సమావేశం

ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంలో పడిన నేపథ్యంలో జేడీఎస్​ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. బెంగళూరులోని ఓ​ రిసార్టులో జరిగిన ఈ భేటీలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముంబయి క్యాంప్​లో ఉన్న ఎమ్మెల్యేలు వెనక్కి రావాలని విజ్ఞప్తి చేశారు కుమారస్వామి.

మరోసారి భాజపా ఎల్పీ భేటీ..

బెంగళూరులోని ఓ హోటల్​​లో భాజపా శాసనసభా పక్ష సమావేశం జరిగింది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా నేతలు చర్చించారు. ఎలాగైనా.. సోమవారం బలపరీక్ష జరిగేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి వచ్చే ముందు మరోసారి కాషాయ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.

సుప్రీంకు స్వతంత్రులు..

మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్​​, శంకర్​లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష జరిగేలా చూడాలని.. సోమవారం ఉదయం పిటిషన్​ దాఖలు చేయనున్నారు.

'ఎవరిబలమెంతో సభలో తేలుతుంది'

కుమార స్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజు అని జోస్యం చెప్పారు కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప. ఎవరి బలమెంతో శాసనసభలో తేలిపోతుందన్నారు. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

"రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌లకు విలువ లేదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా సీఎం వ్యవహరిస్తున్నారు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కుమార స్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు.''

-యడ్యూరప్ప,

ప్రతిపక్షనేత

అసంతృప్త ఎమ్మెల్యేల వీడియో..

కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే తాము ముంబయిలో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ధన ప్రలోభాలకు లోనవ్వలేదని తెలిపారు. పరిస్థితి సద్దుమణిగాక కర్ణాటక వస్తామని వివరణ ఇచ్చారు.

సుప్రీంలో విచారణ జరిగేనా?

గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈనెల 17న సుప్రీంకోర్టు తీర్పులోని విప్​ జారీ అంశంపై మరింత స్పష్టత కోరుతూ సీఎం కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతుందా లేదా అనే అంశంపై నేడు తేలే అవకాశం కనిపిస్తోంది.

లెక్కల చిక్కులు

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. అధికారంలో కొనసాగేందుకు ప్రభుత్వానికి కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం. సంక్షోభానికి ముందు కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 118. భాజపా బలం 105. కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇద్దరు స్వతంత్ర సభ్యులు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు. 16 మంది రాజీనామా లేఖలు సమర్పించినా... సుప్రీంకోర్టును 15 మంది అసంతృప్తులే ఆశ్రయించారు. ఆ 15 మంది రాజీనామాలను స్పీకర్​ బలపరీక్షకు ముందే ఆమోదిస్తే... కర్ణాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అప్పుడు.. ప్రభుత్వం కొనసాగేందుకు కనీసం 105 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ సంఖ్యా బలం కుమారస్వామి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు. భాజపాకు మాత్రం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

ఇదీ చూడండి: తుపాకీతో బెదిరించాడు.. నిలువు దోపిడీ చేశాడు

Last Updated : Jul 22, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details