మీకేమైనా కొత్త వ్యాపారం చేసే ఆలోచన ఉందా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఎవరైనా కాస్త తడబడతారు. సూటూ, బూటూ వేసుకుని, బాగా చదువుకున్న సంపన్నులే వ్యాపారాలు చేయగలుగుతారన్న అపోహ చాలామంది సామాన్యుల్లో ఉంటుంది. ఈ అభిప్రాయం నిజం కాదని నిరూపిస్తోంది 68 ఏళ్ల మహిళ. 10వ తరగతితోనే చదువు మానేసిన ఉత్తర్ప్రదేశ్ కన్నౌజ్ గుందాకు చెందిన వ్యాపారి కిరణ్ రాజ్పూత్.. ప్రస్తుతం ఏడాదికి 25 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఇతరులకు కూడా శిక్షణనిస్తోంది. కిరణ్ రాజ్పూత్ విజయాన్ని దిగ్గజ సంస్థ గూగుల్ సైతం ప్రశంసించింది.
రాజ్పూత్ ప్రత్యేకత తెలియాలంటే ఓ దీవిని చూడాల్సిందే. అయితే.. అది సహజంగా ఏర్పడిన దీవి అనుకుంటే మాత్రం పొరబాటే. తనకున్న 25 బిగాల వ్యవసాయ భూమినే దీవిగా మార్చేసిందా మహిళ. ప్రస్తుతం ఆ ప్రాంతం పర్యటక ప్రదేశంగా కళకళలాడుతోంది. బోటింగ్ చేసేందుకు యువత ఇక్కడికి తరలివస్తారు. ఇక్కడ పెరిగే చేపలు, పండ్లు కిరణ్కు అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.
"2016లో ఓ ప్రభుత్వ పథకం అమల్లోకి వచ్చింది. ఇది ప్రారంభించేందుకు మాకు రుణం దొరికింది. ఎలా చేశావని ఇప్పుడు నన్నందరూ అడుగుతుంటారు. మొదట్లో నేనూ చాలా కష్టాలే పడ్డాను. డబ్బు సమకూర్చుకుని, చేపల చెరువుపై పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు అదే పెద్ద వ్యాపారంగా మారింది. ఈ వ్యాపారం గురించి ఔత్సాహికులకు కూడా నేర్పించాం".
-కిరణ్ రాజ్పూత్.
"మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా నీరే కనిపించేదట. ఇలా నీరు నిల్వ ఉండడం వల్ల వ్యవసాయం కష్టంగా మారేది. చాలా నష్టపోయేవాళ్లం. ఆ తర్వాతే చేపల పెంపకం చేపట్టాలని మా అమ్మ నిర్ణయించుకున్నారు".
-శైలేందర్, కిరణ్ కుమారుడు.
ఓ కొత్త వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టడం అంత సులువైన పనికాదు. ప్రభుత్వం నుంచి రుణంగా కిరణ్కు రెండు లక్షల రూపాయలే లభించాయి. మిగతా డబ్బంతా ఇంటి నుంచీ, బంధువుల నుంచీ సేకరించి, చేపల చెరువుపై 11 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది.