తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2019, 5:26 AM IST

ETV Bharat / bharat

'ప్రజల చేతుల్లోనే రాజ్యాంగ పరిరక్షణ'

అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం ఏర్పాటు చేసిన 70వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని యథాతథంగా అమలు చేస్తూ.. సర్వోన్నతమైనదని నిరూపించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. వ్యవస్థల పనితీరు మెరుగుపడితేనే రాజ్యాంగం బలపడుతుందని తెలిపారు.

constitution
ప్రజల చేతుల్లోనే రాజ్యాంగ పరిరక్షణ-జస్టిస్​ ఎన్​.వి. రమణ

రాజ్యాంగ స్ఫూర్తిని యథాతథంగా అమలుచేస్తూ... అది సర్వోన్నతమైనదని నిరూపించేందుకు నిరంతరం కృషి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా... దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డగా మిగిలిపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా... దాన్ని అమలు చేసేవారు సజ్జనులైతే అది మంచిగా నిలిచిపోతుంది’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాటలను సదా మదిలో ఉంచుకొని నడుచుకోవాలని సూచించారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఏర్పాటుచేసిన 70వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు.

‘విభజనలు, దోపిడీలతో గడిచిన గతం- సమసమాజ స్థాపన కోసం అంకితమైన భవిష్యత్తు మధ్య వంతెన నిర్మించే ప్రయత్నాన్ని రాజ్యాంగం చేసింది. ప్రతి నవంబరు 26న సుప్రీం కోర్టు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల పట్ల గౌరవాభిమానాలను చాటుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో రాజ్యాంగం నిర్దేశించిన ఆదర్శాలను ఆచరణలో చూపేందుకు ప్రయత్నించిన వారిని మరవకూడదు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడంతోపాటు, అందరినీ కలుపుకొని పోతేనే ప్రజాస్వామ్య సంస్థలు విజయవంతంగా పనిచేస్తాయని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ 70 ఏళ్ల కిందట ఇదేరోజు చెప్పారు. రాజ్యాంగం హక్కులతో పాటు... బాధ్యతలను కూడా నిర్దేశించిందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. రాజ్యాంగం బలపడాలంటే రాజ్యాంగ వ్యవస్థల పనితీరు, నిర్వహణ మెరుగుపడుతూ ఉండాలి. బ్రిటిష్‌ కాలం నాటి ఆలోచన ధోరణిని విడనాడాలి. రాజ్యాంగం పట్ల మన నిబద్ధతను మరోసారి చాటుకోవడం, గతం గురించి ఆత్మపరిశీలన చేసుకోవడం ఈ ఉత్సవ ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగం ప్రకారం... అంతిమ న్యాయనిర్ణేత అయిన సుప్రీంకోర్టు పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఉన్న మార్గాలను మనం పరిశీలించాలి. నూతన సాధనాలను అందిపుచ్చుకొని; సరికొత్త విధానాలు, నవకల్పనలు, నూతన వ్యూహాలను అనుసరిస్తూ రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయవ్యవస్థకు రూపకల్పన చేయాలి."

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

జస్టిస్‌ బోబ్డే శ్రమను అభినందించాల్సిందే..

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే కఠోర శ్రమను అందరూ అభినందించాల్సిందే. న్యాయస్థానం తీర్పులను సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లోకి అనువదించేందుకు శ్రమించడమే కాకుండా... సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయవ్యవస్థ, న్యాయ ప్రక్రియను ప్రజలు అర్థం చేసుకొనేలా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అనుపమానం. ఏడాదిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, కక్షిదారులకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవడానికి న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విశేష కృషి చేస్తున్నారు.’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

ఆ తీర్పుల్లో సమైక్య స్ఫూర్తి: రవిశంకర్‌

రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం తదితర కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు... భారత నాగరికతలోని సమైక్య భావనను ఇముడ్చుకున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకుని మెలగాలన్నారు.

* దేశంలో నాలుగు చోట్ల హైకోర్టుకు పైన అపిలేట్‌ న్యాయస్థానాలను నెలకొల్పాలని, తద్వారా రాజ్యాంగపరమైన కీలక అంశాలపై సుప్రీంకోర్టు మరింత దృష్టి సారించే వీలుంటుందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాల్సి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పాల్గొని, ప్రసంగించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ ఖన్నా తదితరులు మాట్లాడారు. తీర్పులను తొమ్మిది భారతీయ భాషల్లోకి అనువదించే సువాస్‌ (సుప్రీంకోర్టు విధిక్‌ అనువాద్‌ సాఫ్ట్‌వేర్‌) యాప్‌ను ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

తీర్పులు మరిన్ని భాషల్లో..

మన రాష్ట్రపతి సామాజిక అంశాల పట్ల నిరంతరం జాగరూకతతో ఉంటారు. 22 ఏళ్లపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగిన ఆయన... భారతీయ న్యాయవ్యవస్థ పట్ల ఉన్న పూర్తి అవగాహనతో అందరికీ న్యాయవ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నో సూచనలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు ప్రాంతీయ భాషల్లో ఉండాలని గత ఏడాది రాష్ట్రపతి సూచించారు. ఆ సూచనలు ఈ ఏడాది జులై నుంచి ఆచరణలోకి తెచ్చినందుకు మేం గర్విస్తున్నాం. ప్రస్తుతం తొమ్మిది భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని భాషల్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం.

అందరికీ న్యాయం అందేవరకూ... మా కర్తవ్యం ముగియదు...

అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చేంత వరకూ తమ కర్తవ్యం ముగియదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే అన్నారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృత్రిమ మేధో (ఏఐ) సాంకేతికత దోహదపడుతుందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం... న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, ప్రభుత్వానికి మాత్రమే సంబంధించింది కాదనీ, ఇది అందరిదీ అని చెప్పారు. దిగువ కోర్టుల్లో సిబ్బంది, వసతుల కొరత ఉందని ప్రస్తావించిన ఆయన... కేసులను వేగంగా, ప్రతిభావంతంగా పరిష్కరించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ‘న్యాయ పంపిణీ వ్యవస్థ’లో సమస్యలను ఏఐ ద్వారా పరిష్కరించుకుంటే... జడ్జిలు, న్యాయవాదుల ‘మైండ్‌ స్పేస్‌’ ఖాళీ అవుతుందని, తద్వారా ఒత్తిడి తగ్గి వారు మరింత ప్రతిభావంతంగా కేసులను పరిష్కరించే వీలుందని అన్నారు.

ఇదీ చూడండి : విమానం హైజాక్​- లగేజీ దొంగలించి పరార్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details