తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2019, 5:35 AM IST

Updated : Dec 24, 2019, 8:02 AM IST

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ఎన్నికల్లో స్థానిక సమస్యలే విజయ సోపానాలు

ఝార్ఖండ్​​ శాసనసభ ఎన్నికల్లో అధికార భాజపా జాతీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మహారాష్ట్రలో శరద్​ పవార్​ అనుసరించిన ప్రచార సూత్రాన్ని జేఎంఎం-కాంగ్రెస్​-ఆర్జేడీ కూటమి అనుసరించింది. స్థానిక సమస్యను ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఝార్ఖండ్​ ఓటర్లు జాతీయ అంశాలను పట్టించుకోని కారణంగా భాజపాకు ఘోర పరాభవం తప్పలేదు.

jharkhand
ఝార్ఖండ్​ ఎన్నికల్లో స్థానిక సమస్యలే విజయ సోపానాలు

మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ అనుసరించిన ప్రచార సూత్రాన్ని పాటించి ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. అక్కడ ప్రచారంలో భాజపా జాతీయ అంశాలపై మాట్లాడితే పవార్‌ స్థానిక సమస్యలను ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఝార్ఖండ్‌లో ఇదే పునరావృతమయింది. భాజపా అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటు పార్టీ కార్యకర్తలంతా పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదం, ఇస్లామిక్‌ దేశాల్లో మైనార్టీల దుస్థితి, పౌరసత్వ సవరణ చట్టం ఆవశ్యకత, అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిరం నిర్మాణంపై ఊరూవాడా ప్రచారం చేశారు.

స్థానిక సమస్యలే ప్రధాన అస్త్రంగా..

ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)-కాంగ్రెస్‌- ఆర్జేడీ మాత్రం జాతీయ, హిందుత్వ విషయాల జోలికి పోలేదు. తలుపుల్లేని మరుగుదొడ్లు, అసంపూర్తిగా మిగిలిన ఇళ్ల నిర్మాణం పనులు, ప్రభుత్వ పథకాల్లో లోపాలు, అధికార యంత్రాంగంలో అవినీతిపై ప్రచారం చేశాయి. ప్రధాని మోదీ 12 బహిరంగ సభలు, హోం మంత్రి అమిత్‌ షా 15 బహిరంగ సభల్లో ప్రసంగించినా ఝార్ఖండ్‌ సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించలేకపోయారు. దీన్నే విపక్షాల కూటమి అవకాశంగా తీసుకొంది. రఘుబర్‌దాస్‌ ఏకపక్ష నిర్ణయాలు కూడా భాజపాను దెబ్బతీశాయి. పార్టీ అగ్రనాయకులు కూడా ఆయనపైనే అధికంగా ఆధారపడ్డారు.అన్నీ తానై వ్యవహరించడం వల్ల పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మిత్రపక్షాలను దూరం చేసుకోవడం, పార్టీ ఫిరాయింపుదార్లకు టిక్కెట్లు ఇవ్వడం నష్టపరిచాయి.

కలిసిరాని వర్గ సమీకరణాలు

భాజపాకు ఈసారి వర్గ సమీకరణాలు కూడా కలిసి రాలేదు. ఓబీసీ అయిన రఘుబర్‌ దాస్‌ను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసి ప్రయోజనం పొందింది. ఈసారి ఓబీసీ కార్డు పనిచేయలేదు. గిరిజనుల కోసమే బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ను విడదీశారని, అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని గిరిజనులకు ఇవ్వడం సంప్రదాయం కాగా, దాన్ని భాజపా ఉల్లంఘించిందన్న అభిప్రాయం ఆ వర్గాల్లో బలపడింది. కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం కలిగేలా అటవీ హక్కుల చట్టం తెచ్చారని, గిరిజనులు నిరాశ్రయులవుతారని జేఎంఎం చేసిన ప్రచారం ఆకట్టుకొంది. దాంతో గిరిజనులు భాజపాకు దూరమయ్యారు. గతంలో లేని విధంగా రాష్ట్రంలోని 14.5 శాతం ముస్లింలు విపక్షాలకు మద్దతు పలికారు. వారు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయడం గమనార్హం. సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరక అఖిల ఝార్ఖండ్‌ విద్యార్థి సంఘం (ఏజేఎస్‌యూ) భాజపా కూటమిని వీడింది. ఓబీసీ అయిన కుర్మీ సామాజిక వర్గంపై, ముఖ్యంగా ఛోటానాగ్‌పుర్‌ ప్రాంతంపై ఈ విద్యార్థి సంఘానికి పట్టుంది. ఆ సంఘం 27 చోట్ల పోటీ చేయడం వల్ల భాజపా భారీగా నష్టపోయింది.

భాజపాకు ముప్పు తెచ్చిన మూకదాడులు

గో సంరక్షణ పేరుతో జరిగిన మూకదాడులు కూడా భాజపాకు ముప్పు తెచ్చాయి. గత అయిదేళ్లలో జరిగిన మూకదాడుల్లో 20 మంది మరణించారు. ఇందులో 11 మంది ముస్లింలు ఉన్నారు. చిన్న పిల్లలను అపహరిస్తున్నారన్న అనుమానంతో అయిదుగురు దళితులను హత్య చేశారు. గొడ్డు మాంసం తింటున్నారన్న ఆరోపణలతో జరిగిన దాడుల్లో ఇద్దరు క్రైస్తవ గిరిజనులు మరణించారు. మరికొన్ని సందర్భాల్లోనూ ఇలాంటి దాడులు జరిగాయి. మూకదాడులు చేసిన ఎనిమిది మందికి శిక్షలు పడితే వారికి కేంద్ర మాజీ మంత్రి జయంత్‌ సిన్హా దండలు వేయడం భాజపాను ఇరకాటంలోకి నెట్టింది. బడుగు వర్గాల రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం బలపడడం భాజపాను బాగా దెబ్బతీసింది.

లోక్‌సభకు అలా... ఇప్పుడు ఇలా

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, మిత్రపక్షాలు మొత్తం 14 స్థానాల్లోనూ 12 చోట్ల గెలుపొందాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఓటర్లు పట్టించుకోలేదు. అన్ని రకాల వనరులను వినియోగించినా భాజపా తన స్థానాన్ని పదిలపరచుకోలేకపోయింది.

ఇదీ చూడండి: 'దేశాన్ని కాపాడేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి'

Last Updated : Dec 24, 2019, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details