గతేడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరహా కుట్రను భగ్నం చేశామని కశ్మీర్ పోలీసులు ప్రకటన చేశారు. పుల్వామాలో కారుబాంబును నిర్వీర్యం చేసిన అనంతరం కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
"జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాది ఆదిల్ దాడికి పాల్పడుతున్నాడని మాకు సమాచారం అందింది. భద్రతా దళాల వాహనాలను కారు ద్వారా ఢీకొట్టి పేల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ వాహనంలో 40- 45 కిలోల పేలుడు పదార్థాలు ఉండవచ్చు. ఈ కుట్రలో జైషే సంస్థ ప్రధాన పాత్ర వహించగా హిజ్బుల్ ముజాహిద్దీన్ సాయం అందించింది. ఇది 2019 ఫిబ్రవరిలో సీఆర్పీఎఫ్ వాహనాలపై జరిగిన ఉగ్రదాడి తరహాలోనిదే."
- ఐజీ విజయ్ కుమార్
ఈ దాడి కోసం జైషే, హిజ్బుల్ సంస్థలు కలిసి వేస్తున్న ప్రణాళికలకు సంబంధించి మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిందని విజయ్ తెలిపారు. సాంట్రో కారులో ఐఈడీ బాంబును బిగించినట్లు తెలియగానే అప్రమత్తంగా వ్యవహరించినట్లు స్పష్టం చేశారు.