కేంద్రప్రభుత్వం ముందు నుంచి ఊహించినట్టుగానే కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. కశ్మీర్వ్యాప్తంగా ముందు జాగ్రత్తల్లో భాగంగా ప్రత్యేక బలగాలను కేంద్రం మోహరించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక దేశం, ఒకే రాజ్యాంగం అనే నినాదాన్ని వినిపించిన భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 కశ్మీర్కు కల్పిస్తున్న ప్రత్యేక హక్కులు ఏమిటి? అది రద్దు చేస్తే కశ్మీరీలు కోల్పోయే హక్కులు ఏమిటనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చరిత్ర
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేరుస్తూ సవరణలు చేశారు. 1957 జనవరి 26 నుంచి కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు సుదీర్ఘ ప్రక్రియ సాగింది. దాదాపు పదేళ్లు సాగిన ఈ ప్రక్రియలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పుడు, అప్పటి జమ్ముకశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే పాకిస్థాన్ సైన్యం కశ్మీర్లోకి చొచ్చుకురావడంతో హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లోనే కొన్ని షరతులతో కశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు హరిసింగ్ తన అంగీకారాన్ని తెలిపారు. అలా 1947 అక్టోబరు 26న కశ్మీర్ భారత యూనియన్లో విలీనమైంది.
అయితే ఈ విలీనం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే అంశాలకే పరిమితమైంది. అప్పటికి విలీనం తుది విధి విధానాలు ఖరారు కాకపోవడంతో 1949 జులైలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత షేక్ అబ్దుల్లా, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కశ్మీర్కు ఉండాల్సిన హక్కులపై ముమ్మర చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా 1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్ అంశాల్లో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు కల్పిస్తూనే రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1956 నవంబర్లో జమ్ముకశ్మీర్ రాజ్యాంగం ప్రక్రియ పూర్తి చేశారు. చివరకు కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. 1957 జనవరి 26 నుంచి ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.