దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య సమసిపోతుందా? ఏళ్ల తరబడి కోర్టుల్లో నానిన అయోధ్య భూ వివాద దావాకు సర్వోన్నత న్యాయస్థానంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అత్యంత కీలకమైన ఈ కేసులో వాదనలను ముగించిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వాయిదా వేయడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇన్నేళ్లుగా నడిచిన వివాదం పూర్వాపరాలు.
ఇదీ.. అయోధ్య వివాదం
* ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ ఒక మసీదును నిర్మించారు. బాబర్ పేరు మీద ఆ ప్రార్థనా స్థలాన్ని బాబ్రీ మసీదుగా పిలుస్తున్నారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న రామ మందిరాన్ని నేలకూల్చి ఈ మసీదును నిర్మించారని హిందుత్వవాదులు నమ్ముతున్నారు. అది రాముడి జన్మస్థలమని వాదిస్తున్నారు.
* 1859లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఒక కంచెను నిర్మించి, ఆ చోటును రెండు భాగాలుగా చేసింది. ప్రార్థనాస్థలంలోని లోపలి భాగంలో ముస్లింలు, వెలుపలి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసింది.
* మసీదు వెలుపల నిర్మించిన వేదిక (రామ్ ఛబుత్ర)పైన ఒక మండపాన్ని నిర్మించేందుకు అనుమతించాలని 1885లో మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.
* 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలు కనిపించాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి. రెండు పక్షాలూ కోర్టును ఆశ్రయించాయి. మొత్తమ్మీద 2.77 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది.
* 1989లో బాబ్రీ మసీదు పక్క స్థలంలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషద్ (వీహెచ్పీ) శంకుస్థాపన చేసింది. మసీదును వేరే చోటుకు మార్చాలని వీహెచ్పీ నేత దేవకీ నందన్ అగర్వాల్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో అయోధ్య స్థల యాజమాన్యంపై అప్పటివరకూ దాఖలైన నాలుగు పిటిషన్లు అలహాబాద్ హైకోర్టులోని ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.
* 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును ‘కరసేవకులు’ కూల్చివేశారు.
హైకోర్టు తీర్పు... సుప్రీంలో సవాల్...
అయోధ్య స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్ దావాలపై అలహాబాద్ హైకోర్టు 2010లో కీలక తీర్పు వెలువరించింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టంచేసింది. తీర్పును సవాల్ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి బుధవారం వరకూ రోజువారీగా విచారణ సాగించింది.
సుప్రీం కోర్టులో ఎవరి వాదనేంటి?
గత 40 రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు సాగాయి. కక్షిదారుల ఆస్తి హక్కులు, కేసులో వారి అర్హతలు సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
హిందూ పక్షాల వాదన
* అయోధ్యలో రామాలయాన్ని ఇంచుమించుగా 11వ శతాబ్దంలో విక్రమాదిత్య చక్రవర్తి నిర్మించి ఉంటారు. ఆ గుడిని 1526లో బాబర్ లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు ధ్వంసం చేశారు.