నీరు... భూమిపై ఉండే ప్రతి ప్రాణి మనుగడకు ఓ ఆధారం. భూమి మీద నాలుగింట మూడొంతుల నీరు ఉంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నీటి కొరతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నీటిని మనిషి దుర్వినియోగం చేయడం, ఇంతటి విలువైన నీటి సంరక్షణపై అశ్రద్ధ చూపించడం. కానీ హరియాణా పాల్వాల్ జిల్లాలోని ఓ గ్రామం అందరికీ భిన్నంగా వ్యవహరిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచే ప్రశంసలు అందుకుంది. నీటి కొరత ఎప్పటికీ తమ దరి చేరకుండా ఓ వినూత్న పద్ధతిని అవలంబిస్తోంది. ఇందుకు ఆ గ్రామం ఎంచుకున్నది "వర్షపు నీరు".
నీటి సంక్షోభం నుంచి...
భిదుకి గ్రామంలో ఒక్కప్పుడు తీవ్ర నీటి కొరత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామ ప్రజలు.. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టుకుంటున్నారు. ఇందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ సత్యదేవ్ గౌతమ్.
సత్యదేవ్ గౌతమ్ బీటెక్, ఎంబీఏలో పట్టా పొందారు. గ్రామానికి సేవ చేయాలని.. అక్కడి పరిస్థితులు మార్చాలని చిన్నప్పటి నుంచి ఆయన కలలు కనేవారు. ఇందుకోసం లక్షల రూపాయల జీతం ఉన్న ఉద్యోగాన్ని విడిచి 2016లో సర్పంచ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి.
గ్రామంలో ఒకప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉండేది. ముఖ్యంగా గ్రామంలో ఉన్న బాలికల ప్రభుత్వ పాఠశాల వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. కొంచెం వర్షం పడినా నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి.