తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2020, 10:40 AM IST

ETV Bharat / bharat

కేరళ కి'లేడీ' స్వప్న విద్యార్హతలూ నకిలీవేనా!

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ విద్యార్హతలపై పోలీసులు దర్యాప్తు చేస్తారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. నకిలీ డిగ్రీతోనే రాష్ట్ర ఐటీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగం సంపాదించినట్లు స్వప్నపై ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు సీఎం.

KL-GOLD-WOMAN
స్వప్న

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ రాచమార్గంలో దుబాయ్​ నుంచి బంగారం తరలించటంలో కీలక పాత్ర పోషించింది. అయితే స్వప్నకు సరైన విద్యార్హతలు లేవని ఆరోపణలు ఉన్నాయి.

నకిలీ బీకామ్ పట్టాతో రాష్ట్ర ఐటీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగం సంపాదించినట్లు తెలుస్తోంది. అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​ దౌత్య కార్యాలయంలోనూ స్వప్న పనిచేసింది. ఆమె విద్యార్హతలపై రాష్ట్రంలోని కొన్ని పోలీస్​ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి.

సీఎం స్పష్టత..

ఈ ఆరోపణల నేపథ్యంలో స్వప్న విద్యార్హతలపై విచారణకు ఆదేశించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.

"ఈ విషయానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఆమె విద్యార్హతలపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు."

- పినరయి విజయన్, కేరళ సీఎం

రాచమార్గంలో బంగారం స్మగ్లింగ్​..

ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన.. సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇందులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​పై లుక్​ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసినట్లు తెలిసింది.

పక్కా సమాచారంతో....

సాధారణంగా కన్‌సైన్‌మెంట్‌గా పేర్కొనే పార్సిళ్లను తనిఖీ చేయరు. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సోదాలు చేయగా అసలు విషయం బయటపడింది. పట్టుబడ్డ నిందితుడు సరిత్‌, గతంలో కేరళలోని యూఏఈ కాన్సులేట్‌లో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశాడు. స్వప్న సురేశ్‌ కూడా ఇదే కార్యాలయంలో పనిచేసింది. దీంతో కేరళ ఐటీ శాఖలో పనిచేసే స్వప్న సురేశ్‌ బంగారం స్మగ్లింగ్ కోసం నకిలీ కాన్సులేట్‌ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి.

గతంలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసిన స్వప్నను.. కేరళ ఐటీ శాఖలో ఏ ప్రాతిపదికన నియమించారనే అంశంపై దర్యాప్తు సాగుతోంది.ఈ కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో సీఎం కార్యదర్శిగా అదనపు బాధ్యతలను చూస్తున్న ఐటీ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను రెండు బాధ్యతల నుంచి ఇటీవల తప్పించారు. దర్యాప్తు నిమిత్తం స్వప్నతోపాటు సందీప్​ను జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలోకి తీసుకుంది.

ఇదీ చూడండి:కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు కి'లేడీ' అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details