తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2020, 5:49 PM IST

ETV Bharat / bharat

టీఎంసీలో అసమ్మతి సెగ- భాజపాకు లాభించేనా?

ఎన్నికలకు 10 నెలలు మాత్రమే గడువు ఉన్న వేళ బంగాల్​లో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలే దీదీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోక్​సభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన భాజపా... రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ నెగ్గి అధికారం చేపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

Infighting, discontent brewing in TMC ahead of 2021 assembly
బంగాల్​లో రాజ్యమేలుతున్న అసంతృప్తి- భాజపా అనుకూల పవనాలు

బంగాల్​లో రాజకీయ వేడి రాజుకుంది. మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార పార్టీలో అసంతృప్తి సెగలు బయడపడుతున్నాయి. అంపన్​ తుపాను పునరుద్ధరణ కార్యక్రమాలు సహా కరోనాను కట్టడిలో ప్రభుత్వం తీరుపై తృణమూల్ కాంగ్రెస్​లోని కీలక నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్ ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపిన విషయం స్పష్టమైంది. ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు పార్టీ మారడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఫలితంగా 42 స్థానాలకు గానూ 22 లోక్​సభ స్థానాలతో సరిపెట్టుకుంది. అనూహ్యంగా భాజపా 18 సీట్లు గెలుచుకుంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన పోటీదారుగా భాజపా ఎదురునిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ముందే పార్టీలో పరిస్థితులు చక్కదిద్దుకోవడం దీదీకి చాలా ముఖ్యం.

నేతల అసంతృప్తి

ఎన్నికల వేళ పార్టీలో అసంతృప్తులు, అభిప్రాయ భేదాలు దీదీకి సవాల్​ విసురుతున్నాయి. సీనియర్ నేతలైన సధాన్ పాండే, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎంపీ మహువా మోయిత్రా వంటి కీలక నేతల వ్యవహారం టీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. అంపన్​ను ఎదుర్కోవడంపై వీరంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సొంత ప్రభుత్వంపైనే విమర్శలు

అంపన్ పునరుద్ధరణ కార్యక్రమాల్లో పార్టీ అధికారంలో ఉన్న కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర ఏంటో చెప్పాలని పాండే ప్రశ్నించగా.. తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఉత్తర, దక్షిణ పరగణాల సహాయ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు కనిపించకపోవడంపై ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీఎంసీ జాతీయ ప్రతినిధి మోయిత్రా అయితే ఏకంగా తన నియోజకవర్గం క్రిష్ణానగర్​లో పంచాయతీల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక లేని పనులు, స్థానిక నేతల అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

"ఇలాంటి సీనియర్ నాయకులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిచేవే. నేతలు తమ అభిప్రాయాలను చెప్పాలని పార్టీ ఆదేశించకున్నా... ప్రజల మధ్య అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణమేంటి? వారేదైనా సందేశం ఇస్తున్నారా అనే విషయంపై పరిశీలన చేయాలి."

-టీఎంసీ సీనియర్ నేత

ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. తన వెంటే ఉండి పార్టీని బలహీనపరిచే బదులు పార్టీ విడిచివెళ్లాలంటూ నేతల పేర్లు చెప్పకుండా వ్యాఖ్యానించారు. అయినా పార్టీలో పరిస్థితి మాత్రం మారినట్లు కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

అందివచ్చిన అవకాశం

టీఎంసీలో అసమ్మతి రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అధికార పార్టీ నేతలను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్​లో కీలకంగా వ్యవహరించిన భాజపా నేత ముకుల్ రాయ్ ఈ బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఎంసీలోని కీలక నేతలు, ఎన్నికైన ప్రతినిధులను భాజపాలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ముకుల్. కొంత మంది అగ్రశ్రేణి టీఎంసీ నాయకులు తనతో సంప్రదింపులు చేస్తున్నారని ఇప్పటికే స్పష్టం చేశారు.

"మరికొద్దిరోజుల్లో వారు(టీఎంసీ నేతలు) భాజపాలో చేరతారు. కొన్ని నెలల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పేక మేడలా కూలిపోవడం మీరు చూస్తారు."

-ముకుల్ రాయ్, భాజపా నేత

భాజపా జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్​వర్గియా సైతం ఇదే స్వరం వినిపించారు. తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించిన టీఎంసీ నేతలను కొనియాడారు. 'టీఎంసీలో గందరగోళ పరిస్థితుల గురించి తెలుసు. వారిలో కొందరైనా నిజాలు మాట్లాడటం శుభపరిణామం' అని వ్యాఖ్యానించారు.

టీఎంసీ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీపై బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్​ ప్రశంసలు కురిపించడమూ ప్రాధాన్యం సంతరించుకుంది. కోల్​కతా నగర ఉత్తమ మేయర్లలో ముఖర్జీ ఒకరని ఘోష్​ అనడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది.

అయితే తృణమూల్ నాయకత్వం మాత్రం ఇవన్నీ పార్టీ నేతల మధ్య పరస్పర విశ్వాసం దెబ్బతీసేందుకు భాజపా చేస్తున్న కుట్రలని భావిస్తోంది.

పార్టీ శ్రేణుల ఘర్షణలు

కరోనా, అంపన్ వంటి విపత్తులతో రాష్ట్రం పోరాటం చేస్తున్న వేళ పలు జిల్లాల్లో టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవలు ముదురుతున్నాయి. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ఝార్​గ్రామ్, మెదినీపుర్, బిర్​భుమ్, బుర్ద్వాన్, నదియా జిల్లాల్లో స్థానిక నాయకుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలువురు మరణించిన దాఖలాలూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా ఈ ఘర్షణలు రాష్ట్రంలో సాధారణంగా మారిపోయాయి.

గత ఐదేళ్లుగా ఈ ప్రాంతాల్లో తన బలాన్ని క్రమంగా పెంచుకుంటున్న భాజపా.. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నాయకులను ఆకర్షిస్తూ పార్టీ క్యాడర్​ను బలపర్చుకుంటోంది.

నష్టనివారణ చర్యలు

రాష్ట్రంపై పట్టు కోల్పోకుండా చూసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మమత. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో జట్టుకట్టిన టీఎంసీ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలు నియోజకవర్గాల్లో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. పనిచేయని నాయకులు, మంత్రులను గుర్తించి వారి ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని గట్టి సూచనలు చేసింది.

ప్రశాంత్​ కిశోర్​ నేతృత్వంలోని ఐ-ప్యాక్​ సంస్థ నుంచి వచ్చే సలహాలతో పాటు పార్టీ ఫీడ్​బ్యాక్​ను ఉపయోగించుకొని విధానపర, సంస్థాగత మార్పులు చేయనున్నట్లు టీఎంసీ నేతలు చెబుతున్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ స్పష్టం చేశారు.

"మమతా బెనర్జీని, పార్టీ గుర్తును చూసే బంగాల్ ప్రజలు ఓటేస్తారు. దీదీ లేకపోతే మేమంతా లేనట్లే. పార్టీలోని వారందరూ పార్టీ నియమాలుకు కట్టుబడి ఉండాల్సిందే. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ప్రజల మధ్యలో వీటిని చర్చించాల్సిన అవసరం లేదు."

-పార్థా ఛటర్జీ, టీఎంసీ ప్రధాన కార్యదర్శి

బంగాల్​లో కాంగ్రెస్, సీపీఎం ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. 2011 ఎన్నికల్లో దీదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే టీఎంసీ విధానాల వల్లే బంగాల్​లో భాజపా బలపడిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోమెన్ మిత్రా చెప్పుకొచ్చారు. సీపీఎం, కాంగ్రెస్​ వంటి లౌకికవాద పార్టీలను టీఎంసీ అణచివేసినంది కాబట్టే భాజపా పుంజుకుందన్నారు. టీఎంసీ ఇప్పుడు తన సొంత నిర్ణయాలకే బలవుతోందని వ్యాఖ్యానించారు.

ఇలా అసంతృప్తులు, అసమ్మతులు, ఆకర్షణల పర్వంతో రసవత్తరంగా సాగుతున్న బంగాల్​ రాజకీయం... రానున్న 10 నెలల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుంది, ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరాంశం.

ABOUT THE AUTHOR

...view details