తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రివ్యూ 2019: యుద్ధ వాకిట నుంచి శాంతి కూడలికి భారత్​-పాక్ - Indo-Pak ties in 2019: From brink of war to corridor of peace

భారత్​-పాకిస్థాన్​.. దాయాది దేశాలే అయినా ఈ రెండింటి మధ్య సఖ్యత అంతంతే. ఇందుకు చాలా కారణాలే ఉన్నప్పటికీ ముఖ్యంగా వినిపించేది మాత్రం పాకిస్థాన్​ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందన్న భారత్​ వాదన. 2019 ప్రారంభంలో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. ఆ వెనువెంటనే జరిగిన పరిణామాలతో దాయాదుల మధ్య ఊహించని రీతిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నుంచి శాంతియుత కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవం వరకు ఏడాది మొత్తం ప్రతికూల, అనుకూల పవనాలతో మమేకమై సాగిన భారత్-పాక్​ బంధం విశేషాలు మీకోసం..

Indo-Pak ties in 2019: From brink of war to corridor of peace
రివ్యూ 2019: యుద్ధమేఘాల నుంచి శాంతి కూడలికి భారత్​-పాక్

By

Published : Dec 25, 2019, 4:58 PM IST

Updated : Dec 25, 2019, 6:54 PM IST

1965, 1971 ఈ ఏడాదులు చూస్తే.. గుర్తొచ్చేది భారత్​-పాక్ మధ్య జరిగిన యుద్ధాలు. 2019 కూడా వాటి సరసన చేరబోతోందా? అన్న సందేహాల నుంచి ఆర్టికల్​ 370 రద్దు, కుల్​భూషణ్​ జాదవ్​ కేసు, కర్తార్​పుర్​ నడవా ప్రారంభం వరకు ఈ ఏడాదిలో భారత్​-పాక్ మధ్య సాగిన మైత్రిని ఓసారి చూద్దాం.

మోదీకి ఇమ్రాన్​ శాంతి మంత్రం

2018 ఆగస్టులో పాక్ ప్రధానిగా ఇమ్రాన్​ఖాన్​ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రధానిగా తొలి ప్రసంగంలోనే భారత్​తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సరిహద్దు సహా ఇతర సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని ప్రధాని మోదీకి స్నేహహస్తం అందించారు.

ముంచుకొచ్చిన యుద్ధమేఘాలు

ఇమ్రాన్​ఖాన్​ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగుపడొచ్చని అందరూ భావించారు. అయితే 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పాక్​ ఆధారిత జైషే మహ్మద్​ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత సీఆర్పీఎఫ్​ జవాన్ల వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏకంగా 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థానీ​ ఉగ్ర సంస్థ దుశ్చర్యతో యావత్​ భారతం రగిలిపోయింది. పాక్​పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద తేడా లేకుండా భారతీయులంతా ప్రభుత్వాన్ని కోరారు.

భారత్​ ప్రతీకారం

సీఆర్పీఎఫ్​ జవాన్ల వీరమరణంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నందున మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన దళాలు పాక్​ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి.. బాలాకోట్​లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మన జవాన్లను బలిగొన్న వారి ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయి. 1971 యుద్ధం తరువాత పాక్ భూభాగంలోకి భారత వాయుసేన విమానాలు ప్రవేశించడం ఇదే తొలిసారి.

యుద్ధ మేఘాలు

ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 27న భారత్​-పాక్​ దేశాల వాయుసేనల మధ్య గగనతలంలో చిన్నపాటి యుద్ధం జరిగింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ జెట్లను తరిమికొట్టే సమయంలో అనూహ్య రీతిలో వింగ్ కమాండర్​ అభినందన్ వర్ధమాన్​​ విమానం పాక్​ భూభాగంలో నేలకూలింది. గాయాల పాలైన వర్ధమాన్​ను పాక్​ సైనికులు బంధించారు.

భారత సైనికుడిని పాక్​ సేనలు బంధించినందున పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్​-పాక్​ వైపుకేసి చూసిన తరుణంలో.. దాయాది దేశాల మధ్య మరోమారు యుద్ధం తప్పదా? అన్న సందేహాలు చెలరేగాయి. అయితే అదే సమయంలో వర్ధమాన్​ అభినందన్​ను భారత్​కు తిరిగి అప్పగిస్తామని పాక్​ ప్రకటన చేసినందున.. యుద్ధ మేఘాలు కాస్త చల్లబడ్డాయి.

కర్తార్​పుర్​ చర్చలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్నికల హామీలో భాగంగా జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని ఈ ఏడాది ఆగస్టులో రద్దు చేసింది మోదీ సర్కారు.

ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో పాక్​ మరోమారు గుర్రుమంది. భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని తెగేసి చెప్పింది. పాక్​లోని భారత హై కమిషనర్​ను బహిష్కరించింది. భారత్​తో విమాన, రైల్వే, రోడ్డు మార్గాల సేవలను నిలిపివేసింది. ఈ పరిణామాల నడుమ కర్తార్​పుర్​ నడవా నిర్మాణం ఓ ప్రశ్నార్థకంగా మిగిలింది. కానీ, ఈ సందేహాలకు చెక్​ పెడుతూ అనుకున్న విధంగానే గురునానక్​ 550వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నవంబరులో కర్తార్​పుర్​ నడవాను ఇరుదేశాలు వేర్వేరుగా ప్రారంభించాయి.

మరోమారు పాక్ వ్యతిరేక గళం

ఇటీవల పౌరసత్వ చట్టానికి మోదీ ప్రభుత్వం అంగీకారం తెలపడంపై పాక్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దక్షిణాసియాలో శరణార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందంటూ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇదే ఏడాదిలోనే కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో అంతర్జాతీయ కోర్టు సాక్షిగా భారత్​ దౌత్యపరమైన విజయం సాధించింది. ఇలా 2019వ ఏడాదిలో భారత్-పాకిస్థాన్​ దేశాల మైత్రి ఓసారి బలపడుతూ ఇంకోసారి క్షీణిస్తూ ఎవరి అంచనాలకు అందకుండా సాగింది.

ఇదీ చూడండి : తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

Last Updated : Dec 25, 2019, 6:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details