ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) మధ్య మరింత సహకారం ఉండాలని భారత్ స్పష్టం చేసింది. సామాజిక, మానవతా సంబంధాలు, మానవ హక్కులపై కార్యకలాపాలు సాగించే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం.. మూడో కమిటీలో భారత్ తన గళాన్ని వినిపించింది. భారత్ తరఫున మాట్లాడిన పావ్లోమి త్రిపాఠీ... అంతర్జాతీయ శాంతి, స్థిరమైన అభివృద్ధికి చేపట్టే చర్యలను.. ఉగ్రవాదులకు నిధులు అందజేసే సంస్థలు నీరుగారుస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై నొక్కి చెప్పారు త్రిపాఠీ.
"ఐఎస్ఐఎల్, అల్ షబాబ్, బొకొ హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మనుషుల అక్రమ రవాణా, సహజ వనరుల అక్రమ వెలికితీత, సాంస్కృతిక కళాఖండాల వ్యాపారం, తమ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అక్రమ సుంకాలు వంటి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. నార్కోటిక్స్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చుకోవడానికే కాక యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అక్రమ విధానాల ద్వారా సంపాదించిన డబ్బును సరిహద్దు దాటిస్తున్నారు."
--పావ్లోమి త్రిపాఠీ, ఐరాసలో భారత్ తరపు కార్యదర్శి
అధునాతన సమాచార వ్యవస్థ ఉండాలి
"వీటి ప్రభావం కేవలం ప్రభుత్వ పరిపాలనకే పరిమితం కాదు. హవాలా, అవినీతి, ఇతర ఆర్థిక నేరాల ద్వారా స్వదేశీ వనరులకు తీవ్రమైన హాని కలుగుతుంది. ఉగ్రవాదం, బహుళజాతి వ్యవస్థీకృత నేరాల కలయికతో ఈ సమస్యలు మరింత క్లిష్టతరమవుతున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే నెట్వర్క్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థలతో ఐక్యరాజ్యసమితి మరింత సహకారం పెంపొందించుకోవాలి. డ్రోన్లు, వర్చువల్ కరెన్సీ, రహస్య సంభాషణ, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను ముష్కరులు ఉపయోగిస్తున్నారు. దీనిపై పోరాడటానికి ఎఫ్ఏటీఎఫ్ వంటి ఏజెన్సీలకు అధునాతన సమాచార వ్యవస్థ అవసరం ఉంది."
--పావ్లోమి త్రిపాఠీ, ఐరాసలో భారత్ తరపు కార్యదర్శి
అదుపులో డ్రగ్స్....