భారత్లో పర్వత ప్రాంత పర్యటక ప్రదేశాలు పరిమిత వనరులతో ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమందికే ఆతిథ్యం కల్పించగలిగే సామర్థ్యం ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి 2018 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య 8.5 రెట్లు పెరిగింది. ఏ పర్యాటక ప్రాంతం చూసినా కిటకిటలాడుతోంది. డార్జిలింగ్ నుంచి మనాలి వరకు దేశంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలన్నీ యాత్రికుల సంఖ్య పెరిగితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ, పొంగిపొర్లే మురుగు, అడ్డగోలు నిర్మాణాలు, నీటికి కటకట తదితర సమస్యలతో సతమతమవుతున్నాయి. భారతీయ పర్యాటక ప్రాంతాల స్థితిగతులు ఇలా ఉండగా మన పొరుగునే ఉన్న చిన్ని దేశం భూటాన్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
ఉన్నత శ్రేణికి పెద్దపీట...
భారత్, బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి ప్రాంతీయ పర్యాటకుల స్వేచ్ఛా ప్రవేశానికి ఫిబ్రవరి 4న భూటాన్ ముగింపు పలికింది. ఆ దేశంలో పర్యటించే మొత్తం పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే 70 శాతందాకా ఉంటుంది. ఇకపై ఇలాంటి పర్యాటకులు రోజుకు రూ.1,200 చొప్పున సుస్థిరాభివృద్ధి రుసుము(ఎస్డీఎఫ్) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము కేవలం కొన్ని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలకే వర్తిస్తుంది. తక్కువ బడ్జెట్తో విహార యాత్రలు చేపట్టేవారికిది పెద్ద దెబ్బే. ఎస్డీఎఫ్ కారణంగా వ్యయాలు 50 నుంచి 60 శాతం దాకా పెరిగే అవకాశం ఉంది. 2018లో భూటాన్లో 2.74 లక్షల మంది పర్యటించారు. ఇందులో రెండు లక్షల మంది ప్రాంతీయ పర్యాటకులే.
తక్కువ బడ్జెట్ పర్యటకులే అధికం...
మూడింట రెండోవంతు ప్రాంతీయ యాత్రికులు భూటాన్లోకి ప్రవేశించేందుకు చవకగా ప్రయాణించే రహదారి మార్గాలనే ఉపయోగించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది తక్కువ ఖర్చుతో పర్యటించే బడ్జెట్ పర్యాటకులే. ఇలాంటి పరిస్థితుల్లో భూటాన్ కొత్తగా యాత్రికులపై రుసుములు ఎందుకు విధించిందనే ప్రశ్న తలెత్తకమానదు. ఉన్నత శ్రేణికి చెందిన ఖరీదైన పర్యాటకుల్ని కాదని; వనరులు, సౌకర్యాలన్నింటినీ ఆక్రమించే ‘బడ్జెట్’ పర్యాటకుల్ని ఆ దేశం కోరుకోవడం లేదు. ఉన్నత శ్రేణి పర్యాటకులైతే దీర్ఘకాలంపాటు బస చేస్తారు. కార్లు, ఆహారం, ఇతర సౌకర్యాలపై పెద్దమొత్తంలో ఖర్చు పెడతారనేది వారి ఉద్దేశం.
భూటాన్ భేష్...
ఇదంతా ఎందుకంటే, భూటాన్ తన పర్యావరణం పట్ల ఎల్లప్పుడూ ఒకింత జాగ్రత్తగా ఉంటుంది. సాంస్కృతిక పర్యావరణంపై శ్రద్ధవహిస్తుంది. గత దశాబ్ది కాలంలో ఆ దేశంలో పర్యాటకుల సంఖ్య సుమారు మూడురెట్లు పెరిగింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో ఆ దేశం నియంత్రణ చర్యలకు నడుంకట్టింది. దీనివల్ల పలు ప్రయోజనాలు సమకూరతాయి. దేశంలోకి పెద్దయెత్తున తరలి వచ్చే పర్యాటకుల్ని రుసుముల పేరిట నిలువరించడం ద్వారా అడ్డగోలుగా చేపట్టే నిర్మాణాలను పరిహరించవచ్చు. అత్యంత ఆకర్షణీయ పర్యాటక కేంద్రాల్లో భారీస్థాయిలో పోగుపడే వ్యర్థాల ముప్పు, పర్యావరణ క్షీణతను అడ్డుకోవచ్చు. ఉన్నత శ్రేణి పర్యాటకుల ద్వారా గరిష్ఠస్థాయిలో ఆదాయాల్ని పొందవచ్చు. ఎవరూ పెద్దగా సందర్శించని పర్యాటక ప్రదేశాల్లో ఎస్డీఎఫ్ను విధించడం లేదు. దీనివల్ల ‘బడ్జెట్’ ప్రయాణికుల్ని ఆయా ప్రాంతాల్లో పర్యటించేలా ప్రోత్సహించవచ్చు.